కోమటిరెడ్డిపై చెప్పుతో దాడికి యత్నించిన కాంగ్రెస్ కార్యకర్త!
-మనుగోడులో ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్న ప్రచారం
-పాల్వాయి స్రవంతి కాన్వాయ్ లోని వాహనాన్ని ధ్వంసం చేసిన బీజేపీ శ్రేణులు
-ఆందోళనకు దిగిన పాల్వాయి స్రవంతి
-చౌటుప్పల్ లో 18 థౌంజండ్ వాలా పేల్చిన యువకులు
-కోమటిరెడ్డికి బుద్ధి చెపుతామని నినాదాలు
మునుగోడు ఉపఎన్నిక ప్రచారపర్వం ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. పార్టీల మాటల యుద్ధమే కాకుండా… భౌతిక దాడులు కూడా చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు రువ్వుకుంటున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ లోని ఒక వాహనాన్ని బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. దీంతో, ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బీజేపీ శ్రేణులు ఈ పనికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ దాడిపై ఆమె ఆందోళనకు కూడా దిగారు. ఈ ఘటన కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహాన్ని నింపింది.
ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా ఒక కాంగ్రెస్ కార్యకర్త ఆయనపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించాడు. కోమటిరెడ్డి ప్రచారం చేస్తున్న వాహనంపైకి ఎక్కి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన కోమటిరెడ్డి వెనక్కి జరిగారు. వెంటనే బీజేపీ కార్యకర్తలు సదరు కాంగ్రెస్ కార్యకర్తను పక్కకు లాగిపడేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కోమటిరెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో 18 థౌజెండ్ వాలా పేల్చిన యువకులు
మునుగోడు ఉప ఎన్నికలో ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. విపక్షాలపై ప్రత్యర్థి పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నిరసిస్తూ కొందరు యువకులు 18 థౌంజండ్ వాలా టపాసులను పేల్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులను తీసుకుని ఆయన బీజేపీలో చేరారంటూ టీఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ కు చెందిన కొందరు యువకులు టపాసులు పేల్చారు. మనుగోడు ఆత్మగౌరవాన్ని కోమటిరెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో కోమటిరెడ్డికి తగిన బుద్ధి చెపుతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.