Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఏపీపై కేంద్రం కరుణ..ఒకేసారి రూ.10,461 కోట్ల నిధుల మంజూరు…

ఏపీపై కేంద్రం కరుణ.. 2014-15 రెవెన్యూ లోటు కింద ఒకేసారి రూ.10,461 కోట్ల నిధుల మంజూరు

  • ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద నిధుల మంజూరు
  • ప్రకటించిన ఆర్థిక శాఖ డైరెక్టర్ మహేంద్ర చండేలియా
  • రెవెన్యూ లోటు భర్తీ చేయాలంటూ 2014 నుంచి ఏపీ ప్రభుత్వం అభ్యర్థన
  • ఇన్నాళ్లుగా కొర్రీలు వేస్తూ వచ్చిన కేంద్రం అకస్మాత్తుగా నిధుల విడుదల

నిధులు సరిపోక అల్లాడుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. 2014-15 నాటి రెవెన్యూ లోటు భర్తీకి ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద రూ.10,460.87 కోట్లను ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 19న కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి విడతల వారీగా నిధులను విడుదల చేస్తూ వచ్చిన కేంద్రం తొలిసారిగా ఇన్ని నిధులను ఏకమొత్తంలో విడుదల చేసింది. ఎన్నికల ఏడాదిలో ఈ మొత్తాన్ని విడుదల చేయడం విశేషం.

2014లో రాష్ట్ర విభజన తరువాత రెవెన్యూలోటు భర్తీ కోసం అప్పట్లో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో కొంత మొత్తాన్ని విడుదల చేసిన కేంద్రం మిగిలిన సొమ్ముకు కొర్రీలు వేసింది. వాస్తవానికి విభజన తేదీ నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే మధ్య కాలంలో 2014-15 కాలానికి రిసోర్సెస్ గ్యాప్‌కు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో పరిహారం చెల్లించాలి. దీంతో, 2014-15 కాలానికి రాష్ట్రంలో రెవెన్యూలోటును రూ.16,078 కోట్లుగా తేల్చారు.

ఈ క్రమంలో కేంద్రం 2014లో తొలి విడతగా రూ.2303 కోట్లు విడుదల చేసింది. ఆ తరువాత 2015లో మరో రూ. 500 కోట్లు, 2016లో రూ.1176.50 కోట్లు వెరసి మొత్తం రూ.3979.50 కోట్లు ఇచ్చింది. మిగతా మొత్తాన్ని 2016లో విడుదల చేస్తామని చెప్పిన కేంద్రం, ఇంకా రూ.139.39 కోట్లు మాత్రమే ఇవ్వాలని ఆ తరువాత వెల్లడించింది. మిగిలిన మొత్తాన్ని కొత్త పథకాల కోసం ఖర్చు చేశామని 2017 మేలో అప్పటి ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

2018లో ఈ విషయమై కేంద్రంతో రాష్ట్ర అధికారులు చర్చలు జరిపారు. కాగ్ ధ్రువీకరణ ఆధారంగా రెవెన్యూ లోటును రూ. 16,078 కోట్లుగా పరిగణించాలన్నారు. 2014-15 నాటికి బిల్లులు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కానీ, అప్పట్లో కేంద్రం ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు.  రాష్ట్రం ప్రభుత్వం పలు దఫాలుగా వినతిపత్రాలు సమర్పించినా స్పందన కరవైంది.

అయితే, ఈ ఏడాది మార్చిలో కేంద్రం రెవెన్యూ లోటుకు సంబంధించి రాష్ట్రం నుంచి వివరాలు కోరింది. 2014-15, అంతకుముందు కాలానికి సంబంధించి ఏయే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి? వాటిల్లో చెల్లించాల్సిన బిల్లులు ఏవి? తదితర వివరాలతో ఆధారాలతో సహా పంపాలని కోరింది. ఆ తరువాత ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద సుమారు రూ.10,461 కోట్లను విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

Related posts

విద్యుత్ సరఫరాపై బీహార్‍‌లో నిరసన.. కాల్పుల్లో ఒకరి మృతి

Ram Narayana

వరుసగా ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలతో జగన్ భేటీ…

Drukpadam

ఫ్రొఫెషనల్ బైక్ రేసర్ అవతారంలో రాహుల్ గాంధీ

Ram Narayana

Leave a Comment