- అల్లూరి జిల్లాలో విషాద ఘటన
- చోడవరం నుంచి పాడేరు వెళుతున్న ఆర్టీసీ బస్సు
- పాడేరు ఘాట్ రోడ్డులో వ్యూ పాయింట్ వద్ద ప్రమాదం
- మలుపు తిరిగే క్రమంలో లోయలోకి దూసుకెళ్లిన బస్సు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడి ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. వారిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాడేరు ఘాట్ రోడ్డులో ఈ ప్రమాద ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఆర్టీసీ బస్సు చోడవరం నుంచి పాడేరు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పాడేరు ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ వద్ద మలుపు తిరుగుతుండగా, బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
పాడేరు ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్బ్రాంతి
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వద్ద ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందడం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
కాగా, పాడేరు ఘాట్ రోడ్డులో వ్యూ పాయింట్ వద్ద రోడ్డుపై పడి ఉన్న చెట్టును తప్పించబోయి బస్సు లోయలో పడిందని ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన ఇతర వాహనదారులు వెల్లడించారు. సహాయ చర్యల కోసం ఘటన స్థలికి చేరుకున్న అధికారులు సెల్ ఫోన్ సిగ్నల్స్ లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.