తుమ్మల ఇంటికి క్యూకడుతున్న నేతలు …రాయబారాలా…? పరామర్శలా…!
నిన్నరాజ్యసభ సభ్యులు వద్దిరాజు ,ఎమ్మెల్సీ తాతా మధు ,ఎమ్మెల్యే సండ్రలు
నేడు ఎంపీ నామ ,మిర్యాలగూడెం ఎమ్మెల్యే భాస్కర్ రావు
తనకు సీటు కేటాయించకపోవడంపై తుమ్మల గుస్సా..
మర్యాద లేని చోట ఎందుకని… తుమ్మల పై అనుయాయిల వత్తడి
తర్జనభర్జనలో తుమ్మల అనుచరులతో సమాలోచనలు …
కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని అంటున్న తుమ్మల
మాజీమంత్రి సీనియర్ రాజకీయ నేత తుమ్మల ఇంటికి పలువురు నేతలు క్యూకడుతున్నారు .ఇందుకు కారణంలేకపోలేదు …మొదటిది బీఆర్ యస్ నుంచి పాలేరు సీటు ఆశించిన తుమ్మలకు కేసీఆర్ ప్రకటించిన లిస్ట్ లో పేరు లేకపోవడం …రెండవది ఆయన పంటి నొప్పితో బాధపడుతున్నందున పలకరించే పేరుతో వస్తున్నారు . ఆయన్ను పలకరించడంతో పాటు ఆయన అభిప్రాయాలు , ఆయన మూడ్, ఎలా వుంది వైఖరి ఏమిటి అనేదాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వచ్చినవారికి కాపీ ,టీ లు ఇచ్చి గౌరవప్రదంగా సాగనంపుతున్న తుమ్మల తన మనుసులో మాటను బయట పెట్టడంలేదు …మంగళవారం జిల్లాకు చెందిన ఎంపీ వద్దిరాజు , ఎమ్మెల్సీ తాతా మధు , ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హైద్రాబాద్ లోని తుమ్మల నివాసానికి వెళ్లగా , బుధవారం ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు , మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కర్ రావు లు వెళ్లారు . రాజకీయ పరమైన అంశాలు చర్చకు వచ్చినప్పటికీ తమ చేతులో ఏమిలేదని వారు నిస్సహాయత వెలిబుచ్చారు … తన తదుపరి కార్యాచరణపై తుమ్మల తలమునకలై ఉన్నారు .కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని అంటున్నారు …
తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కేసీఆర్ వైఖరిపై తుమ్మల గుర్రుగా ఉన్నారు . 2018 ఎన్నికల్లో తుమ్మల పాలేరు టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు …దానికి కారణం ఖమ్మంలో మనకత్తులు మనల్నే పొడిచాయని మీడియా సమావేశంలో అంగీకరించి కేసీఆర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు . తుమ్మల ఓటమికి కారణం తెలుసుకున్న కేసీఆర్ దానికి భాద్యులుగా అప్పటి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చేశారు . దీనిపై పూర్తీ సమీక్ష గానీ అసలు ఎవరెవరు దీని వెనకాల ఉన్నారనే కారణాలు కానీ వెలికి తీయలేదు .. తుమ్మల దోషికానప్పుడు ఆయనకు శిక్ష వేయడం , ఆయన్ను కనీసం కలిసేందుకు తన అభిప్రాయాలు చెప్పేందుకు అనుమంతించడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఓడిపోయిన దగ్గర నుంచి తుమ్మల పార్టీ కార్యక్రమాలలో అప్పుడప్పుడు తప్ప పెద్దగా పాలుపంచుకోలేదు… పార్టీకి దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్న తుమ్మలను గత జనవరి 18 న ఖమ్మంలో జరిగిన బీఆర్ యస్ గర్జన సభ ఇంఛార్జిగా వచ్చిన మంత్రి హరీష్ రావు గండుగులపల్లి లోని తుమ్మల ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానించారు . పార్టీలో గుర్తింపు ఉంటుందని , కేసీఆర్ మాటగా చెప్పారు . సీఎం దూతగా వచ్చిన హరీష్ రావు మాటలను గౌరవించి తుమ్మల ఖమ్మం బీఆర్ యస్ గర్జనలో చురుకుగా పాల్గొన్నారు .దానితర్వాత తిరిగి కథ మొదటికే వచ్చింది…ఆయన కలిసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు .
హరీష్ రావు ఇచ్చిన హామీ మేరకు పాలేరు సీటు తుమ్మలకు గ్యారంటీ అని ఆయన అనుయాయిలు సంబరపడ్డారు .తుమ్మల కూడా పార్టీ నుంచి వచ్చిన సానుకూల పరిణామాలతో పాలేరులో తన ఓటమికి పార్టీలోని కొందరు నాయకులు కారణమని అందువల్ల తనకు కేసీఆర్ టికెట్ ఇస్తాడని నమ్మకంతో ఉన్నారు . ఈసారి పాలేరు లో పోటిఖాయమని ప్రచారం చేశారు . ఆయన్ను నమ్ముకున్నవాళ్లకు భరోసా కల్పించారు . తుమ్మలకే సీటు వస్తుందని అందరు అనుకున్నారు .కానీ తిరిగి కందాల ఉపేందర్ రెడ్డికే టికెట్ ఇవ్వడం తుమ్మలతో పాటు ఆయన శిభిరాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
పాలేరు లో ఆయన అనుయాయులు సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి అల్టిమేటం ఇచ్చారు . తుమ్మలకు సీటు ఇవ్వనందున నియోజకవర్గంలో కందాల ను ఓడించితీరుతామని శపథం చేశారు . అదే సందర్భంలో తుమ్మలను పోటీచేయాలని వత్తిడి తెస్తున్నారు .జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని అంటున్నారు .దీనిపై తుమ్మల మౌనంగానేఉన్నారు .తన దగ్గర కు వచ్చే వాళ్లతో కూడా పొడిపొడి మాటలు మాట్లాడుతున్నారు తప్ప మనసులోని మాటను బయట పెట్టడంలేదు … చూద్దాం ఏమిజరుగుతుందో …..!