నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలి.
-పాలేరు పాతకాలువ ఆయకట్టు ను, సాగర్ ఆయకట్టు క్రింద వేసిన పంటలను కాపాడాలి.
-అవసరం అయితే కర్ణాటకలో మాట్లాడి ఆల్మట్టి నుంచి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి …
ఖమ్మం , నల్గొండ జిల్లాల రైతులను ఆదుకోవాలి ..
- భారీ నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని కలిసిన సిపిఎం బృందం
-మీడియాతో మాట్లాడిన పోతినేని సుదర్శన్ , జూలకంటి రంగారెడ్డి ..
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని భారీ నీటిపారుదల శాఖామాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగా రెడ్డి లు మాట్లాడుతూ ఇప్పటికే రైతాంగం చెరువులలో ఉన్న నీళ్ళను ఆధారం చేసుకొని సాగునీరు విడుదల అవుతుందని ఆశించి నాట్లు వేసుకున్నారు. ఈ కాలంలో చెరువులలో ఉన్న నీళ్ళు అయిపోవడం, భూగర్భ జలాలు తగ్గి బోరుబావులు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు లేకపోవడం వల్ల వాగులు, చెరువులు కూడా ఎండిపోయాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పంట పొలాలు పొట్ట దశకు చేరుకున్నాయి. ఇప్పుడు నీరు అందకపోవడం వల్ల పైర్లు ఎండిపోతున్నాయి. పది రోజుల పాటు నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపి భూగర్భ జలాలను పెంపొందించాలని కోరుతున్నాం. అవసరమైతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి ప్రాజెక్టు నుండి నీటిని తెప్పించుకొని పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం …ఖమ్మం జిల్లా లోని పాలేరు చెరువుకు సాగర్ నీళ్లు వదిలి, పాలేరు పాతకాలువ ఆయకట్టు ను, సాగర్ ఆయకట్టు క్రింద వేసిన పంటలను కాపాడాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్, రాష్ట్ర నాయకులు శోభన్ నాయక్, జిల్లా నాయకులు ఎస్.నవీన్ రెడ్డి, రాయల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.