- పద్మావతి వర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను సందర్శించిన నాని
- తిరిగి వస్తుండగా దాడి
- స్పృహతప్పి పడిపోయిన పులివర్తి నాని
- వర్సిటీ రోడ్డుపై బైఠాయించిన అనుచరులు
ఏపీలో పోలింగ్ ముగిశాక కూడా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఈ సాయంత్రం దాడి జరిగింది. పులివర్తి నాని ఇవాళ తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లారు. అనంతరం, ఆయన తిరిగి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఈ దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. పులివర్తి నాని స్పృహతప్పి పడిపోయారు. దాడిలో ఆయన కారు ధ్వంసం అయింది. కాగా, దాడిని నిరసిస్తూ నాని, ఆయన అనుచరులు పద్మావతి వర్సిటీ రోడ్డుపై బైఠాయించారు.
ఘటన జరిగి గంట అవుతున్నా పోలీసులు ఇప్పటివరకు రాలేదని అనుచరులు ఆరోపించారు. దాదాపు 150 మంది వైసీపీ కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నారని తెలిపారు. వాళ్ల వద్ద కత్తులు, గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయని పేర్కొన్నారు.
తిరుపతి పద్మావతి వర్సిటీ వద్ద ఉద్రిక్తత… టీడీపీ నిరసనకారులపై లాఠీచార్జి

తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఈ సాయంత్రం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరగడం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు పద్మావతి వర్సిటీ రోడ్డుపై బైఠాయించాయి. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పులివర్తి నాని అనుచరులు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో, పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులపై లాఠీచార్జి చేసి, వారిని అక్కడ్నించి చెదరగొట్టారు. సమీపంలోని అపార్ట్ మెంట్లలోకి వెళుతున్న వ్యక్తులపైనా పోలీసులు లాఠీలు ఝళిపించారు.
తొలుత సాధారణ పోలీసులు రాగా, వారితో టీడీపీ నేతలకు వాగ్వాదం జరిగింది. తమకు న్యాయం చేయాలని టీడీపీ కార్యకర్తలు కోరారు. ఈ దశలో ప్రత్యేక బలగాలు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలపై లాఠీలతో విరుకుపడ్డాయి.