- హిమాచల్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని తాను చెప్పలేదని స్పష్టీకరణ
- తాను అలా చెప్పినట్లు వీడియో సాక్ష్యం చూపాలని డిమాండ్
- పత్రికలు, వెబ్ సైట్లు ఇష్టానుసారం వార్తలు రాస్తాయని వ్యాఖ్య
ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ వ్యూహకర్తగా మారిన ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో సహనం కోల్పోయారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ చెప్పిన జోస్యం తప్పింది కదా అంటూ సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ అడిగిన ప్రశ్నకు ఆయన చిందులు తొక్కారు.
తాను జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ చెప్పుకొచ్చారు. హిమాచల్ లో కాంగ్రెస్ గెలుస్తుందని తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలు, ప్రముఖ వెబ్ సైట్ లు ఈ వార్తను ప్రచురించాయని గుర్తుచేయగా ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. పత్రికలు, వెబ్ సైట్లు ఇష్టానుసారం వార్తలు రాస్తాయని విమర్శించారు.
అయితే కరణ్ థాపర్ తన ప్రశ్నను వివరించేందుకు ప్రయత్నించినా పీకే వినలేదు. ఆధారాలు చూపించనందుకు క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు.
దానికి కరణ్ థాపర్ స్పందిస్తూ తెలంగాణలోనూ బీఆర్ ఎస్ గెలుస్తుందంటూ చెప్పిన జోస్యం ఫలించలేదని గుర్తుచేయగా పీకే ఏమాత్రం లెక్కచేయలేదు.
ఇంటర్వ్యూ పేరుతో తనను భయపెట్టాలని చూసినా తాను భయపడబోనంటూ వ్యాఖ్యానించారు. ఇతరుల్లా తాను ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే వెళ్లిపోయే రకం కాదని చెప్పుకొచ్చారు.
ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత నమ్మకంగా ఎలా చెప్పగలరని మాత్రమే తాను అడిగానని కరణ్ థాపర్ చెప్పగా మరో ప్రశ్నకు వెళ్లాలంటూ సూచించారు. ఈ ఇంటర్వ్యూ వీడియోను ‘ద వైర్’ సంస్థ విడుదల చేసింది. దాన్ని ఓ నెటిజన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.