Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

యువతిపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి యత్నం… జైనూర్‌లో 144 సెక్షన్!

  • ఆగస్ట్ 31న ఆదివాసీ యువతిపై షేక్ మగ్దూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నం
  • బాధితురాలు అరవడంతో తలపై బాదిన ఆటో డ్రైవర్
  • యువతి స్పృహతప్పి పడిపోవడంతో పారిపోయిన నిందితుడు
  • రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చి విషయం చెప్పిన బాధితురాలు
  • నేడు జైనూర్‌లో బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీలు

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్ధూం అనే ఆటో డ్రైవర్  లైంగిక దాడికి యత్నించిన ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. యువతిపై అఘాయిత్యాన్ని నిరసిస్తూ జైనూర్ పట్టణంలో ఈరోజు ఆదివాసీలు బంద్‌కు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ఈ ఘటనలో దుకాణాలు తగులబెట్టారు. మంటలు చెలరేగి పొగ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలను నిలిపివేసిన పోలీసులు, 144వ సెక్షన్ విధించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే నిందితుడు షేక్ మగ్దూంను అరెస్ట్ చేసిన పోలీసులు… బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆదివాసీలకు హామీ ఇచ్చారు.

బాధితురాలికి సీతక్క హామీ

బాధితురాలికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రి సీతక్క బాధితురాలి వద్దకు వెళ్లి పరామర్శించారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించి సీతక్క ఓ వీడియోను కూడా విడుదల చేశారు. దీంతో ఆదివాసీ సంఘాలు శాంతించాయి.

ఏం జరిగింది?

ఆగస్ట్ 31న సమీపంలోని గ్రామానికి వెళ్లేందుకు జైనూర్ బస్ స్టేషన్ వద్ద బాధిత ఆదివాసీ మహిళ నిలబడింది. ఆ తర్వాత ఆమె ఆటో రిక్షాను ఎక్కింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆటో డ్రైవర్ ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు అరిచే ప్రయత్నం చేసింది. దీంతో అతను ఆమె తలపై బలంగా కొట్టాడు. ఆమె పడిపోవడంతో… డ్రైవర్ భయపడి పారిపోయాడు. 

మహిళ పడిపోవడాన్ని కొంతమంది చూశారు. ఆమె ప్రమాదంలో గాయపడిందని భావించి ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సెప్టెంబర్ 2న స్పృహలోకి వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని చెప్పింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడు షేక్ మగ్దూంను అరెస్ట్ చేశారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. 

డీజీపీతో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ

జైనూర్ హింసపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన డీజీపీతో మాట్లాడారు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఒవైసీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు డీజీపీ చెప్పారన్నారు. అదనపు బలగాలను తరలించినట్లు చెప్పారని తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని ఎంపీ విజ్ఞప్తి చేశారు. హింసకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

సుక్మా-బిజాపూర్ అటవీప్రాంతంలో రక్తసిక్తం

Drukpadam

రంగారెడ్డి జిల్లాలో కిడ్నాపైన యువతిని కాపాడిన పోలీసులు!

Drukpadam

ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న యువతి.. సన్నిహితంగా ఉండగా చూశారని చెల్లెళ్ల హత్య

Ram Narayana

Leave a Comment