- కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే ఇండియా కూటమి ఓడిపోయిందన్న దీదీ
- నాయకత్వం కోసం కూటమిలోని అభ్యర్థులు పోటీకి దిగారన్న మమతా బెనర్జీ
- బీజేపీతో కాంగ్రెస్ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపణ
గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యం కారణంగానే ఇండియా కూటమికి అధికారం దక్కకుండా పోయిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తద్వారా బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్సే కారణమని పేర్కొన్నారు. అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన సందర్భంగా తాను రాసిన మూడు పుస్తకాలను మమతా బెనర్జీ విడుదల చేశారు. ఇందులో 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలపై లోతైన విశ్లేషణ చేశారు.
బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ కారణమని అందులో పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఓ కూటమిగా ఏర్పడ్డాయని, అన్ని కార్యక్రమాలను ఉమ్మడిగా ముందుకు తీసుకువెళ్లామని అందులో పేర్కొన్నారు. కానీ నాయకత్వం కోసం కూటమిలోని అభ్యర్థులు పరస్పరం పోటీకి దిగారని రాసుకొచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ శాయశక్తులా పనిచేసినప్పటికీ కాంగ్రెస్ వైఫల్యం కారణంగా ఇండియా కూటమికి గెలుపు దక్కకుండా పోయిందన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడానికి కూడా మిత్రపక్షాలే కారణమన్నారు. ఇండియా కూటమికి కూడా ఎక్కువగా మద్దతు రావడానికి తృణమూల్ కాంగ్రెస్ కారణమన్నారు. బెంగాల్లో తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా ప్రజామద్దతు లభించిందన్నారు. బెంగాల్లో సీపీఎం నేతృత్వంలోని వామపక్షాలతో కాంగ్రెస్ సీట్ల పంపకాల ఒప్పందం చేసుకుందని, తమ పార్టీకి వ్యతిరేకంగా తీవ్రంగా పని చేసిందన్నారు. బీజేపీతోనూ రహస్య ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు.