- కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి
- ఘటన తర్వాత అప్రమత్తమైన ప్రభుత్వం
- కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించిన అధికారులు
- వీవీఐపీ పాస్లు కూడా రద్దు చేసిన వైనం
ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో నిన్న ఉదయం జరిగిన తొక్కసలాటలో మృతి చెందిన వారి సంఖ్య 30కి పెరిగింది. ఈ ఘటన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని ‘నో వెహికల్’ జోన్గా ప్రకటించారు. వీవీఐపీ పాస్లను రద్దు చేశారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు రోడ్లను వన్ వేగా మార్చారు.
మౌని అమావాస్యను పురస్కరించుకుని పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లక్షలాదిమంది ఒక్కసారిగా తోసుకురావడంతో సంగమ ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు జిల్లాల పోలీసులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను నియంత్రించేందుకు పలు సూచనలు చేశారు.
మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి రాకుండా అన్ని వాహనాలకు ఎంట్రీ పాస్లను రద్దు చేశారు. వీవీఐపీ పాస్లను కూడా రద్దు చేశారు. స్పెషల్ పాస్లు ఉన్నప్పటికీ అనుమతినివ్వకూడదని నిర్ణయించారు. ప్రయాగ్రాజ్ చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను సరిహద్దుల్లోనే నిలిపివేస్తున్నారు. ఫిబ్రవరి 4 వరకు నగరంలోకి రాకుండా నాలుగు చక్రాల వాహనాలను నిషేధించారు.
రోడ్డుపై విక్రయించుకునే చిరు వ్యాపారులను ఖాళీ ప్రదేశాల్లోకి తరలించి ట్రాఫిక్ను క్లియర్ చేయాలని సీఎం యోగి ఆదేశించారు. కుంభమేళాకు వచ్చే వారిని అడ్డుకోవద్దని కోరారు. పోలీసులు పెట్రోలింగ్ను పెంచాలని, కుంభమేళా నుంచి భక్తులు తిరిగి వెళ్లే మార్గాలలో అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. కుంభమేళాకు వచ్చిన భక్తులు వారణాసి, అయోధ్య, చిత్రకూట్, మీర్జాపూర్లను కూడా సందర్శిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోనూ నిఘా పెంచాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.