- ఎన్ఈపీ పేరుతో త్రిభాషా సూత్రాన్ని తెరపైకి తెచ్చిన కేంద్రం
- దానిని అమలు చేసేది లేదంటున్న తమిళనాడు ప్రభుత్వం
- త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తే తమిళ భాష కనుమరుగవుతుందని ఆవేదన
- త్రిభాషా సూత్రానికి తాను వ్యతిరేకమన్న నటి రంజనా నచియార్
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 అమలుపై తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ తమిళ నటి, బీజేపీ నాయకురాలు రంజనా నచియార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్ఈపీ పేరుతో త్రిభాషా సూత్రాన్ని (హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాష) తమపై బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ రంజనా నచియార్ బీజేపీకి రాజీనామా చేశారు. ఎన్ఈపీని అమలు చేయాలని బలవంతం చేయడం సరికాదని రంజన పేర్కొన్నారు. తమిళ భాష గొప్పతనాన్ని తగ్గించే ఈ సూత్రానికి తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. తమిళుల గౌరవానికే తాను కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు. కాబట్టి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఎన్ఈపీని అమలు చేస్తే ప్రాంతీయ భాషలు కనుమరుగవుతాయన్నది తమిళనాడు ప్రభుత్వం వాదన. జాతీయ విద్యా విధానం పేరుతో తమపై హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని అమలు చేస్తే భవిష్యత్తులో తమిళ భాష ప్రమాదంలో పడిపోతుందని, దాని ఉనికే ప్రశ్నార్థకమవుతుందని స్టాలిన్ అంటున్నారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం స్టాలిన్ విమర్శలను కొట్టి పడేస్తోంది. స్టాలిన్ వాదనలో నిజం లేదని, విద్యార్థులు అదనంగా మరో భాషను నేర్చుకోవడం వల్ల లాభం తప్ప నష్టం ఏముంటుందని ప్రశ్నిస్తోంది. అంతేకాదు, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయని రాష్ట్రాలకు విద్యా నిధులు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.