- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ యువ నేత హిమానీ నర్వాల్ హత్య
- ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చి, మృతదేహాన్ని రోహ్తక్-ఢిల్లీ హైవేపై పడేసిన వైనం
- రంగంలోకి దిగిన పోలీసులు.. హిమానీని చంపింది ఆమె స్నేహితుడు సచిన్గా గుర్తింపు
- ఈరోజు ఉదయం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
హర్యానాకు చెందిన కాంగ్రెస్ యువ నేత హిమానీ నర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దుండగులు ఆమెను శనివారం నాడు అత్యంత కిరాతకంగా హతమార్చి, మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి రోహ్తక్-ఢిల్లీ హైవేపై పడేశారు. అయితే, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హిమానీని హత్య చేసిన నిందితుడు సచిన్ ను పోలీసులు ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఈ హత్య కేసును త్వరగా ఛేదించేందుకు పోలీసులు సిట్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసు దర్యాప్తు బృందాలు మృతురాలి కాల్డేటా ఆధారంగా ఆమెను చంపింది స్నేహితుడు సచిన్ అని నిర్ధారించారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో జరిగిన ఘర్షణ కారణంగా ఆమెను నిందితుడు హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఫిబ్రవరి 28న హిమానీ కాంగ్రెస్ మీటింగ్కు హాజరు కావడానికి ముందు ఆమెను కలిసినట్లు సచిన్ పోలీసులతో తెలిపాడు. ఆ సమయంలో తమ ఇద్దరి మధ్య డబ్బు విషయంలో వాగ్వాదం చోటుచేసుకుందని, ఆవేశంలో ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత సూట్ కేసులో మృతదేహాన్ని కుక్కి రోహ్తక్-ఢిల్లీ హైవేపై పడేసినట్లు చెప్పాడు.