- దేశీయ మార్కెట్లో రూ. 90 వేలు దాటిన 10 గ్రాముల బంగారం ధర
- రూ. లక్ష దాటిన కిలో వెండి ధర
- అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులే కారణం
గత కొంతకాలంగా చుక్కల్లో విహరిస్తున్న బంగారం ధరలు మరోమారు భగ్గుమన్నాయి. దేశీయ విపణిలో తొలిసారి నిన్న రూ. 90 వేల మార్కును చేరుకుని జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నిన్న 10 గ్రాముల బంగారం ధర తొలిసారి రూ. 90 వేలు దాటింది. పసిడితోపాటు పెరిగే వెండి కిలో ధర రూ. 1.03 లక్షలకు చేరింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత మొదలైన వాణిజ్య యుద్ధానికి తోడు, పలు దేశాలపై సుంకాలు పెంచుతామన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. అది అంతిమంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది.
అమెరికాలోనూ ఆర్థిక మందగమనం తప్పదన్న ఊహాగానాల నేపథ్యంలో మదుపర్లు బంగారంపైకి పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో పుత్తడి ధరలు పైపైకి పోతున్నాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర రూ. 2,983 డాలర్లకు చేరింది. దీంతో దేశీయ మార్కెట్లోనూ ధరలు పెరిగి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (99.9 స్వచ్ఛత) ధర రూ. 90,450కి చేరుకుంది. కిలో వెండి ధర రూ. 1,03 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది.
మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

- రూ. 600 పెరిగిన 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర
- ఇరవై రోజుల తర్వాత మళ్లీ రూ. 89,450కి చేరిన బంగారం ధర
- వెండి కిలో ధర రూ.1,000 పెరుగుదల
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన పసిడి ధర రూ.600 పెరిగి రూ.89,450 పలికింది. గత నెల 20వ తేదీన ఇదే స్థాయిలో ఉన్న పసిడి ధర ఈ రోజు మళ్లీ అదే స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగిన కారణంగా ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి ధర కూడా పెరుగుతోంది. కిలో వెండి సుమారు రూ.1,000 పెరిగింది. గత సెషన్లో రూ. 1,00,200గా ఉన్న వెండి ధర ఈరోజు రూ. 1,01,200కి చేరుకుంది.
అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు 2,946 డాలర్లకు చేరుకుంది. అమెరికాలో అంచనాలకు మించి ద్రవ్యోల్భణం నమోదయింది. దీంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది. ఈ కారణంతో పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తున్నారు.