- అనకాపల్లి జిల్లాలో విషాదం
- కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
- ఘటన స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి అనిత
బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు ఘటన అనకాపల్లి జిల్లాలో విషాదాన్ని నింపింది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఇవాళ ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతులను… కైలాసపట్నంకు చెందిన అప్పికొండ తాతబాబు (50), సంగరాతి గోవింద్ (40), దేవర నిర్మల (38), పురం పాప (40), గుప్పిన వేణుబాబు (34)… భీమిలికి చెందిన హేమంత్ (20), రాజుపేటకు చెందిన దాడి రామలక్ష్మి (35), చౌడువాడకు చెందిన సేనాపతి బాబూరావు (55)గా గుర్తించారు. ప్రమాద సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో 15 మంది కార్మికులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు.
కాగా, హోం మంత్రి అనిత కైలాసపట్నం చేరుకుని ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాద ఘటనపై స్థానికులు, అధికారులతో ఆమె మాట్లాడారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు మంత్రి అనిత రూ.15 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారని, ఏడుగురికి గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించామని అనిత చెప్పారు. అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేవ్ ఆరా తీశారని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.