- చార్మినార్ సమీపంలోని గుల్జార్హౌస్లో చెలరేగిన మంటలు
- భవనం మొదటి అంతస్తులో భారీగా ఎగసిపడ్డ అగ్నికీలలు
- మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు
- ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు
హైదరాబాద్ లో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున చార్మినార్ సమీపంలో ఉన్న గుల్జార్హౌస్లో మంటలు చెలరేగాయి. భవనం మొదటి అంతస్తులో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈఘటనలో చనిపోయిన వారి సంఖ్య 17కు చేరింది.
ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులను అభిషేక్ మోడీ (30), ఆరుషి జైన్ (17), హర్షలి గుప్తా (7), షీతల్ జైన్ (37), రాజేందర్ కుమార్ (67), సుమిత్ర (65), మున్ని బాయి (72), ఇరాజ్ (2)లుగా గుర్తించారు.
కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి ఆరా తీశారు. అధికారులను అడిగి ప్రమాదానికి సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ను వెంటనే ప్రమాదాస్థలికి వెళ్లాలని ఆదేశించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్, అగ్నిమాపక విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సందర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి అగ్నిప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గుల్జార్ హౌస్ ప్రమాదం.. పదహారుకు చేరిన మరణాలు.. మృతులు వీళ్లే..!

మరణించిన వారి వివరాలు..
రాజేంద్రకుమార్ (67), అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్
హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై రాహుల్ గాంధీ స్పందన

- హైదరాబాద్ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి, పలువురికి గాయాలు
- ఘటనపై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తీవ్ర విచారం
- సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన ఖర్గే
- బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది గాయపడటం పట్ల వారు ప్రగాఢ విచారం తెలిపారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణలోని హైదరాబాద్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పలువురు మరణించడం, అనేక మంది గాయపడటం అత్యంత బాధాకరమని రాహుల్ గాంధీ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. “ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను” అని తన సందేశంలో తెలిపారు.
మల్లికార్జున ఖర్గే కూడా ఈ అగ్నిప్రమాదంపై స్పందించారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. “హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో అనేక అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ దుఃఖ సమయంలో బాధితుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి” అని ఖర్గే ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు.
ముఖ్యమంత్రితో మాట్లాడిన అనంతరం, ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయక చర్యలు తీసుకుంటుందని, బాధితులకు తక్షణమే తగిన పరిహారం అందిస్తుందని తనకు భరోసా లభించిందని ఖర్గే తెలిపారు. “కాంగ్రెస్ కార్యకర్తలు బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, వారికి సాధ్యమైనంత సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కష్టకాలంలో మనమందరం కలిసి బాధితులకు అండగా నిలబడదాం” అని ఆయన పిలుపునిచ్చారు.