కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండడంతో అందరిలో ఆందోళన నెలకొంది. రెండు సార్లు ఈ మహమ్మారి మానవ జీవితాన్ని అతలాకుతలం చేయగా.. మరో సారి దాడికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. దేశంలో రోజురోజుకు కేసుల నమోదు పెరుగుతుండగా.. తాజాగా తెలంగాణకు కూడా కోవిడ్ 19 పాకింది. హైదరాబాద్లో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది. ఒకేరోజు భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోని కూకట్పల్లిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైనట్లు సమాచారం. ఓ వైద్యుడికి కరోనా సోకిందని నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వెంటనే అతడిని అప్రమత్తం చేసినట్లు.. ఆయన క్వారంటైన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంతోపాటు మరికొన్ని చోట్ల కేసులు నమోదవగా.. తెలంగాణలో కూడా కరోనా విజృంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి కేసు నమోదవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కేసుల నమోదు పెరగకుండా.. వెంటనే నివారణ చర్యల కోసం పీపీఈ కిట్లు, ఎన్95 మాస్క్లు, పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది.