- తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులపై రేపు స్పష్టత
- ప్రతిపాదనలతో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్, మహేష్ గౌడ్
- ఢిల్లీ రావాలని సీఎంకు రాహుల్ గాంధీ సూచన
- ఒక స్థానంలో సింఘ్వీ పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం
- రెండో సీటు ఎవరికి దక్కుతుందనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ
తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎవరిని పంపాలనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థులను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ అధిష్ఠానంతో చర్చించి రెండు స్థానాలకు పేర్లను ఖరారు చేయనున్నారు.
అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ప్రతిపాదనలతో ఢిల్లీకి రావాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. సోమవారం శంషాబాద్ విమానాశ్రయం లాంజ్లో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, కేసీ వేణుగోపాల్, మహేశ్ కుమార్ గౌడ్ల మధ్య ఈ విషయంపై ప్రాథమికంగా చర్చ జరిగింది.
రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్కు దక్కనుండగా, అందులో ఒక సీటును సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకే తిరిగి కేటాయించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రెండో స్థానం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై బుధవారం జరిగే సమావేశంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.