- బంజారాహిల్స్ పరిధిలోని ఒక నివాస ప్రాంతంలో కల్తీ నెయ్యి దందా
- గుట్టును రట్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు
- 460 కిలోల కల్తీ నెయ్యి స్వాధీనం
హైదరాబాద్ నగర నడిబొడ్డున సాగుతున్న కల్తీ నెయ్యి దందా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. బంజారాహిల్స్ పరిధిలోని ఒక నివాస ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో పోలీసులు సుమారు 460 కిలోల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ. 18.26 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రముఖ బ్రాండ్ల పేర్లతో ఉన్న నకిలీ ప్యాకెట్లు, సీళ్లు, ప్యాకేజింగ్ యంత్రాలను పోలీసులు సీజ్ చేశారు. వినియోగదారులను మోసం చేసేలా ఈ ప్యాకేజింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. తక్కువ ధరకు వచ్చే నూనెలు, రసాయనాలు కలిపి ఈ నెయ్యిని తయారు చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. స్వాధీనం చేసుకున్న నెయ్యి నమూనాలను ల్యాబ్ పరీక్షల కోసం పంపిన అధికారులు, నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.