ఇరాన్తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై పూర్తిస్థాయి దిగ్బంధనాన్ని (blockade) అమలు చేయనున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. సోమవారం, ఏప్రిల్ 13న తూర్పు కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30) ఈ దిగ్బంధనం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఇరాన్కు చెందిన అరేబియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని తీర ప్రాంతాలు, ఓడరేవులకు వచ్చే లేదా వెళ్లే ఏ దేశ నౌకనైనా అడ్డుకుంటామని సెంట్రల్ కమాండ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. అయితే, హర్మూజ్ జలసంధి గుండా ఇతర దేశాల ఓడరేవులకు వెళ్లే నౌకల స్వేచ్ఛకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షలను తప్పించుకుంటూ చైనా యువాన్ల రూపంలో చెల్లింపులు జరుపుతున్న నౌకలను నిరోధించడమే ఈ దిగ్బంధనం వెనుక అసలు ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా దిగ్బంధనంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఖలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఈ చర్యతో అమెరికా వినియోగదారులకు ఇంధన ధరలు భారీగా పెరగనున్నాయని డొనాల్డ్ ట్రంప్ను హెచ్చరించారు. “ప్రస్తుత పంపు ధరలను ఆస్వాదించండి. మా దిగ్బంధనంతో త్వరలోనే మీరు 4-5 డాలర్ల గ్యాస్ ధరలను గుర్తుచేసుకుని బాధపడతారు” అని ఆయన ఎక్స్లో వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.
ఇదిలావుండగా, ఇటీవల హర్మూజ్ జలసంధిలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తమ హెచ్చరికలతో రెండు అమెరికా యుద్ధనౌకలను వెనక్కి పంపించామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అయితే ఈ వాదనను యూఎస్ సెంట్రల్ కమాండ్ ఖండించింది. తమ యుద్ధనౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ ప్రయాణాన్ని పూర్తి చేశాయని తెలిపింది. ఈ తాజా దిగ్బంధనం ఇరాన్, చైనాలతో అమెరికాకు ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడితే, ముడిచమురు ధరలు పెరిగి ప్రపంచ ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.