జగన్ గాలిలో విహరిస్తే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి…చంద్రబాబు ఆగ్రహం
-వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు రూ.1 లక్ష ఆర్థికసాయం: చంద్రబాబు
-కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన…వరద బాధితులకు పరామర్శ
-సీఎం జగన్ పై విమర్శలు
-ఆయన వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి… ఏరియల్ సర్వే చేసి వెళ్ళాడు అన్న నాదెండ్ల
-చిత్తూరు, కడప జిల్లాల్లో వరద బీభత్సం-సీఎం జగన్ ఏరియల్ సర్వే
-విమర్శలు గుప్పించిన నాదెండ్ల,చంద్రబాబు …
-ప్రజలను పట్టించుకోరా అంటూ ఆగ్రహం
-పలకరించే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప జిల్లాలో వరదల కారణంగా మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. అయిన వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చారు. ఈ సందర్భంగా వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు చంద్రబాబు రూ.1 లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. అంతేకాకుండా, వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.1000 చొప్పున సాయం అందజేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో ఆయన ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. వరదల కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ ఆకాశంలో విహరిస్తే వరద బాధితుల కష్టాలు ఎలా తెలుస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు.
ఆయన వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి… ఏరియల్ సర్వే చేసి వెళ్ళాడు అన్న నాదెండ్ల
ఏపీలో పలు జిల్లాలు ఇప్పటికీ వరద నష్టం నుంచి తేరుకోలేదని, ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ప్రభుత్వం నుంచి పలకరించే దిక్కు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర సీఎం ఇల్లు కదలరని, ఆయన వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.
ఓవైపు ప్రజలు కష్టాలు పడుతుంటే, సీఎం జగన్ ఏరియల్ సర్వే చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. జిల్లాకు రూ.2 కోట్ల సాయం ప్రకటించడం విడ్డూరంగా ఉందని, జగన్ ఏమాత్రం పరిపాలన దక్షత లేని వ్యక్తిగా తయారయ్యారని నాదెండ్ల విమర్శించారు. వరదలతో అతలాకుతలమైన చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించేందుకు నాదెండ్ల ఇవాళ తిరుపతి వచ్చారు. రేణిగుంట ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.