దేశానికి సరికొత్త దశ,దిశ కోసం యత్నం: కేసీఆర్
- ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో భేటీ
- అక్కడే మీడియాతో మాట్లాడిన కేసీఆర్
- దేశంలో ఆశించిన అభివృద్ధి జరగలేదని వ్యాఖ్య
- త్వరలోనే ప్రత్యామ్నాయంపై నిర్ణయముంటుందని ప్రకటన
జాతీయ స్థాయిలో తృతీయ కూటమి కోసం యత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ దిశగా శుక్రవారం సరికొత్త వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకున్న కేసీఆర్ తిరుగు ప్రయాణంలో భాగంగా ఝార్ఖండ్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్తో భేటీ అయ్యారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాట్లు, ఆ దిశగా సాగాల్సిన ఆవశ్యతపై ఆయన సోరేన్తో చర్చించారు. ఈ సందర్భంగా దేశ అభివృద్దిపై కేసీఆర్ తనదైన వ్యాఖ్యలు చేశారు.
దేశానికి సరకొత్త దశ, దిశ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని కేసీఆర్ చెప్పారు. దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు ప్రారంభమయ్యాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం 70 ఏళ్లు దాటినా దేశంలో ఆశించిన మేర అభివృద్ది జరగలేదని కేసీఆర్ అన్నారు. దేశంలో ఇప్పటికంటే మెరుగైన అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. దేశాన్ని సరైన దిశలో నడిపేందుకు ఏ మార్గాన్ని అనుసరిస్తే బాగుంటుందన్న దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దేశంలో ప్రత్యామ్నయంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని కూడా కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఝార్ఖండ్ సీఎంతో కేసీఆర్ భేటీ.. అమర జవాన్ల కుటుంబాలకు చెక్కుల అందజేత
- రాంచీలో కేసీఆర్కు ఘన స్వాగతం
- గిరిజన ఉద్యమ నేత బిర్సా ముండా విగ్రహానికి కేసీఆర్ నివాళి
- ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కుల అందజేత
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో భాగంగా శుక్రవారం ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్తో భేటీ కోసం రాంచీ వెళ్లిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం రాంచీ చేరుకున్న కేసీఆర్కు సోరేన్ నుంచి ఘన స్వాగతం లభించింది.
అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు.. జాతీయ స్థాయిలో మూడో కూటమి ఆవశ్యకతపై కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించినట్టుగా సమాచారం. ఝార్ఖండ్ సీఎం నివాసానికి చేరుకునే క్రమంలో రాంచీలోని బిర్సా ముండా చౌక్లో గిరిజన ఉద్యమ నేత భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి కేసీఆర్ నివాళి అర్పించారు.ఝార్ఖండ్ పర్యటనలో భాగంగా గల్వాన్ వ్యాలీలో అమరులైన ఝార్ఖండ్కు చెందిన ఇద్దరు సైనికుల కుటుంబాలకు కేసీఆర్ రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ చెక్కులు అందజేశారు. గల్వాన్ వ్యాలీలో మరణించిన సైనికులకు ఇదివరకే కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మాట మేరకు శుక్రవారం ఝార్ఖండ్ పర్యటనలో భాగంగా అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ చెక్కులు అందజేశారు.