క్రీడా వార్తలు

ఎదురులేని రాజస్థాన్ రాయల్స్… ముంబయికు తీవ్ర నిరాశ!

ఎదురులేని రాజస్థాన్ రాయల్స్… ముంబయికు తీవ్ర నిరాశ!

  • 23 పరుగుల తేడాతో నెగ్గిన రాజస్థాన్ రాయల్స్
  • తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 రన్స్
  • లక్ష్యఛేదనలో 8 వికెట్లకు 170 రన్స్ చేసిన ముంబయి

ఐపీఎల్ తాజా సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ జయభేరి మోగించింది. ముంబయి డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 23 పరుగులతో ముంబయి ఇండియన్స్ ను ఓడించింది. కీరన్ పొలార్డ్ క్రీజులో ఉండడంతో ఓ దశలో ముంబయి విజయం సాధ్యమే అనిపించినా, సాధించాల్సిన రన్ రేట్ భారీగా ఉండడంతో నిరాశ తప్పలేదు. చివరి ఓవర్ వేసిన నవదీప్ సైనీ అద్భుతంగా బంతులు వేసి పొలార్డ్ ను కట్టడి చేశాడు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఆపై 194 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన పొలార్డ్ ఇన్నింగ్స్ చివరి బంతికి అవుటయ్యాడు.

అంతకుముందు ముంబయి ఓపెనర్ ఇషాన్ కిషన్ 54 పరుగులు చేయగా, మరో యువ ఆటగాడు తిలక్ వర్మ 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 61 పరుగులు చేసి ముంబయి విజయంపై ఆశలు కల్పించాడు. అయితే అశ్విన్ బౌలింగ్ లో తిలక్ వర్మ అవుట్ కావడంతో ముంబయి ఆశలు సన్నగిల్లాయి. ఆదుకుంటారనుకున్న టిమ్ డేవిడ్ (1), డానియల్ సామ్స్ (0) నిరాశపర్చారు. రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైనీ 2, చహల్ 2, ట్రెంట్ బౌల్ట్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.

కాగా, ముంబయి జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. సొంతగడ్డపై ఆడుతున్నప్పటికీ ఆ జట్టు తడబాటుకు గురికావడం టీమ్ మేనేజ్ మెంట్ ను ఆందోళనకు గురిచేస్తోంది.

Related posts

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వర్షం అడ్డొస్తే పరిష్కారం ఏమిటి?

Drukpadam

కుల్దీప్ స్పిన్ ఉచ్చులో పాక్ విలవిల… 228 పరుగులతో భారత్ ఘనవిజయం

Ram Narayana

జస్ట్ గంటన్నర ముందే చెప్పారు.. కెప్టెన్సీ తప్పించడం, రోహిత్ తో విభేదాలపై తొలిసారి విరాట్ కోహ్లీ స్పందన!

Drukpadam