లాక్డౌన్ ఊహాగానాలను పటాపంచలు చేసిన కేంద్రం!
- కంటైన్మెంట్ నిబంధనల గడువు పొడిగింపు
- గతంలో జారీ చేసిన నిబంధనలే మే 31 వరకు అమలు
- 10%కంటే ఎక్కువ పాజిటివిటీ ఉంటే కఠిన నిబంధనలు
- విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు
- అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాల వర్తింపు
![Centre issues Guidelines for containment rules out nation wide lockdown](https://i0.wp.com/img.ap7am.info/telugu-news/images-big/cr-tn-608aee5a60530.jpg?resize=320%2C213&ssl=1)
కరోనా నివారణకు ప్రస్తుతం కొనసాగుతున్న మార్గదర్శకాల గడువును పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన అన్ని నిబంధనలు మే 31 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తాయని తెలిపింది. తాజా ఉత్తర్వుల జారీతో దేశవ్యాప్త లాక్డౌన్ ఉండబోదన్న విషయం స్పష్టమైంది.
ఈ మార్గదర్శకాల ప్రకారం.. 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ ఉన్న ప్రాంతాలు లేదా ఆసుపత్రుల్లో 60 శాతం కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా జిల్లాల్లో కఠిన కంటైన్మెంట్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. అలాగే విపత్తు నిర్వహణ చట్టం కింద చేపట్టాల్సిన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించింది. ఈనెల 25న కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.