క్రైమ్ వార్తలు

చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట… ముగ్గురి మృతి

చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట… ముగ్గురి మృతి

  • గుంటూరు చంద్రన్న కానుకల పంపిణీ
  • ప్రసంగించి వెళ్లిపోయిన చంద్రబాబు
  • కానుకల కోసం తోసుకుంటూ వచ్చిన జనం
  • తొక్కిసలాట చోటుచేసుకున్న వైనం

ఇవాళ గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ సభ జరగడం తెలిసిందే. అయితే, చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్రసంగించి వెళ్లిపోయిన తర్వాత అపశృతి చోటుచేసుకుంది. కానుకలు తీసుకునేందుకు జనం భారీగా తరలివచ్చారు. దాంతో ఒక్కసారిగా తొక్కిసలాట చేసుకోవడంతో ముగ్గురు మృతి చెందారు. ఓ మహిళ సంఘటన స్థలంలోనే మరణించగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

సభ వద్ద మరణించిన మహిళను ఏటీ అగ్రహారానికి చెందిన గోపిశెట్టి రమాదేవిగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజ్యలక్ష్మి, సయ్యద్ ఆసిమా ప్రాణాలు విడిచారు.

ఇవాళ గుంటూరు వికాస్ నగర్ లో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రసంగం కొనసాగినంత సేపు సజావుగానే ఉన్న సభ, ఆయన వెళ్లిపోయిన తర్వాత అదుపుతప్పింది. కార్యక్రమ నిర్వాహకులు, టీడీపీ నేతలు పరిస్థితిని నియంత్రించలేకపోయారు. మహిళ మృతి చెందిన నేపథ్యంలో, నిర్వాహకులు చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు.

గుంటూరు తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్

CM Jagan shocked to know Guntur stampede
గుంటూరు వికాస్ నగర్ లో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకోవడం తెలిసిందే. చంద్రబాబు ప్రసంగం ముగించుకుని వెళ్లిపోయాక, కానుకల పంపిణీ షురూ కాగా, బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించడం కలచివేసిందని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు.

అటు, రాష్ట్ర ఆరోగ్యమంత్రి విడదల రజని గుంటూరు జీజీహెచ్ లో బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా బాధితులను పరామర్శించారు.

గుంటూరు తొక్కిసలాట ఘటనపై ఎస్పీ వివరణ

Guntur SP responds on stampede incident
గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మహిళలు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించారు. పంపిణీ సభలో ఏర్పాటు చేసిన తొలి కౌంటర్ వద్దే తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు. తాము సరిపడినంత బందోబస్తు ఇచ్చామని, బారికేడ్లు విరిగిపడడంతోనే ప్రమాదం జరిగిందని వివరించారు. ముందుజాగ్రత్తలు తీసుకోవాలని తాము నిర్వాహకులకు చెప్పామని ఎస్పీ స్పష్టం చేశారు.

చంద్రన్న కానుకల పంపిణీపై నిర్వాహకులు గత కొన్నిరోజులుగా ప్రచారం చేయడంతో, ఈ కార్యక్రమానికి భారీగా మహిళలు తరలివచ్చినట్టు తెలుస్తోంది.

ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచే మహిళలు క్యూలైన్లలో ఉన్నారని, అయితే ఓ కౌంటర్ వద్ద బారికేడ్ విరిగిపోవడంతో క్యూలైన్ లో ఉన్న మహిళలు ముందుకుపడిపోగా, వెనుక ఉన్నవారు ఒక్కసారిగా వారిపై పడడంతో ఓ మహిళ ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నలుగురు గాయపడగా, వారిని ఆసుపత్రులకు తరలించారు. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.

గుంటూరు మృతులకు రూ.20 లక్షల సాయం ప్రకటించిన ఉయ్యూరు ఫౌండేషన్

Uyyuru Foundation announces 15 lakhs to deceased in Guntur stampede
గుంటూరులో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మరణించారు. రమాదేవి అనే మహిళ సంఘటన స్థలంలోనే మరణించగా, రాజ్యలక్ష్మి, సయ్యద్ ఆసిమా అనే మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఈ నేపథ్యంలో, ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉయ్యూరు శ్రీనివాసరావు స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటామని వెల్లడించారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు పూర్తిగా తామే భరిస్తామని స్పష్టం చేశారు.

Related posts

హంతకుడిని పట్టిచ్చిన హెడ్ సెట్…

Ram Narayana

హైదరాబాద్ నిమ్స్ లో అగ్ని ప్రమాదం

Ram Narayana

ఆస్తిలో వాటా ఇవ్వలేదని తండ్రిని కారుతో ఢీకొట్టి చంపిన తనయుడు…

Ram Narayana