- ఏ మతపరమైన ప్రార్థనా మందిరాలను ఉపేక్షించొద్దు
- ప్రారంభంలోనే ఆక్రమణలను అడ్డు కోవాలి
- అక్రమణల్లో పెదలుంటే ప్రభుత్వ పథకాల ద్వారా న్యాయం చేయాలి
నది, కాల్వలపై అక్రమ నిర్మాణాలతో పాటు రోడ్లపై ఏ మతపరమైన ప్రార్థనా మందిరాలు ఉండొద్దని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికార్లను ఆదేశించారు. వాటిని ప్రారంభంలోనే అడ్డుకోవాలని, వెంటనే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం లోటస్ హిల్స్ లో కోటి రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు నగర మేయర్ పునుకొల్లు నీరజ, కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఆక్రమణల్లో ఎక్కడైనా పేదలు ఉంటే వారికి అవసరమైన ఇండ్ల స్థలం, ఇండ్లు, జీవనోపాధి ప్రభుత్వ పథకాల ద్వారా కల్పించాలని సూచించారు. ప్రణాళికా బద్ధంగా ఖమ్మం నగర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నగరాన్ని పరిశుభ్రంగా వుంచాలని కోరారు. నగర అభివృద్దికి వివిధ శాఖల అధికార్లను సమన్వయం చేసుకుంటూ ప్లాన్ ప్రకారం ముందుకు పోవాలని సూచించారు. అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు కలిసి ప్రజల అవసరాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మురుగు కాల్వాల్లో నీరు నిల్వ ఉండ కూడదన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతని, ఈ విషయంలో ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. నగరంలో చేపట్టిన అభివృద్ది పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. చేపట్టిన పనులు వర్షాకాలం వచ్చే లోగా పూర్తి చేయాలని, ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో చేపట్టాల్సిన పనులకు ప్రతిపాదనలు పంపాలని, నిధులు తెచ్చే బాధ్యత తనదని చెప్పారు. లోటస్ హిల్స్ లో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుకుకు కూడా ప్రతిపాదనలు పంపాలని అధికార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ రవికుమార్, కార్పొరేటర్లు మేడారపు వెంకటేశ్వర్లు, కమర్తపు మురళీ, రాపర్తి శరత్ తదితరులు పాల్గొన్నారు.
