- అమాయక చిన్నారుల ఆశలు చిదిమేయొద్దని విజ్ఞప్తి
- భావితరాలను కాపాడేందుకు యుద్ధం ఆపేయాలన్న మెలానియా
- ఆ పిల్లల చిరునవ్వులు మీరు మాత్రమే కాపాడగలరని వెల్లడి
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని నిలవరించాలంటూ అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ పుతిన్ కు ఓ లేఖ రాశారు. అలస్కాలో జరిగిన భేటీలో డొనాల్డ్ ట్రంప్ తన భార్య రాసిన లేఖను పుతిన్ కు అందజేసినట్లు సమాచారం. ఈ లేఖలో ఉక్రెయిన్ పేరును ప్రస్తావించనప్పటికీ.. అక్కడ ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులపై మెలానియా ఆందోళన వ్యక్తం చేశారు. అమాయక పిల్లల చిరునవ్వులను మీరు మాత్రమే కాపాడగలరని పుతిన్ కు విజ్ఞప్తి చేశారు.
యుద్ధాన్ని ఆపేయడానికి భావితరాల భవిష్యత్తు కలలను పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు. భౌగోళిక సరిహద్దులు, రాజకీయ భావజాలాలకు పిల్లలు అతీతమని చెప్పారు. జన్మించిన ప్రాంతం కారణంగా చిరునవ్వును కోల్పోయి భయాందోళనల మధ్య జీవించాల్సి రావడం సరికాదన్నారు. యుద్ధంలో చిక్కుకున్న పిల్లల నవ్వును ఒంటరిగా పునరుద్ధరించాలని పుతిన్ను కోరారు. పిల్లల అమాయకత్వాన్ని కాపాడటం రష్యాకు సేవ చేయడం కంటే చాలా ఎక్కువేనని మెలానియా ట్రంప్ తెలిపారు.

పుతిన్ ఆ ప్రతిపాదనకు అంగీకరించారు: అమెరికా

- ట్రంప్-పుతిన్ మధ్య అలాస్కాలో కీలక భేటీ
- ఉక్రెయిన్కు అమెరికా, యూరప్ దేశాలు నాటో తరహా భద్రతా హామీ
- రష్యా అంగీకరించిందని వెల్లడించిన అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్
- రష్యా విషయంలో భారీ పురోగతి సాధించామన్న ట్రంప్
- సోమవారం ట్రంప్తో జెలెన్స్కీ సమావేశం
- యుద్ధం ముగింపుపై త్వరలో కీలక ప్రకటన వెలువడే అవకాశం
ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్కు ‘నాటో’ తరహాలో భద్రతా గ్యారంటీ ఇచ్చేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. ఈ హామీ శాంతి ఒప్పందంలో కీలకం కానుందని తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పుతిన్ల మధ్య అలాస్కాలో జరిగిన రహస్య సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరినట్లు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ తెలిపారు. ఉక్రెయిన్లోని అదనపు భూభాగంలోకి రష్యా సైనిక చర్యలు చేపట్టకుండా ఈ ఒప్పందం చట్టబద్ధమైన హామీ ఇస్తుందని ఆయన వివరించారు. ఈ సమావేశం అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో స్పందిస్తూ, రష్యా విషయంలో ఒక ముఖ్యమైన పురోగతి సాధించామని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సోమవారం ట్రంప్తో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి యూరప్ దేశాల నాయకులను కూడా ట్రంప్ ఆహ్వానించినట్లు సమాచారం. దీని తర్వాత ఆగస్టు 22న ట్రంప్, జెలెన్స్కీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ల మధ్య త్రైపాక్షిక చర్చలు జరగవచ్చని భావిస్తున్నారు. ఈ వరుస భేటీల నేపథ్యంలో ఆగస్టు 18న యుద్ధం ముగింపు దిశగా ఓ ముఖ్యమైన ప్రకటన వెలువడొచ్చని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.