జాతీయ వార్తలు

ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం విషమం.. ఆసుపత్రికి తరలింపు…

  • అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నవీన్ పట్నాయక్
  • ఆరోగ్యం క్షీణించడంతో నిన్న భువనేశ్వర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు
  • గత నెలలో ముంబైలో సర్జరీ చేయించుకున్న నవీన్ పట్నాయక్

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ (78) అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను నిన్న భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఇటీవలే ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ మళ్లీ అస్వస్థతకు లోనవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

శనివారం రాత్రి నవీన్ పట్నాయక్ అసౌకర్యానికి గురికావడంతో, వైద్యులు ఆయన నివాసమైన ‘నవీన్ నివాస్’కు వెళ్లి పరీక్షించారు. ఆ తర్వాత, పరిస్థితి మెరుగుపడకపోవడంతో నిన్న ఉదయం ఆసుపత్రిలో చేర్పించారు. నవీన్ పట్నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ఒక హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని ఓ సీనియర్ బీజేడీ నాయకుడు మీడియాకు తెలిపారు.

నవీన్ పట్నాయక్ ఆర్థరైటిస్ సమస్య కారణంగా వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకునేందుకు జూన్ 20న ముంబై వెళ్లారు. అక్కడ జూన్ 22న ఆయనకు విజయవంతంగా సర్జరీ జరిగింది. ఆసుపత్రి నుంచి జులై 7న డిశ్చార్జ్ అయిన ఆయన, జులై 12న తిరిగి ఒడిశాకు చేరుకున్నారు. ముంబై నుంచి వచ్చిన నెల రోజులకే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడం గమనార్హం.

సుదీర్ఘకాలం ఒడిశా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నవీన్ పట్నాయక్, వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. మార్చి 2000 నుంచి జూన్ 2024 వరకు ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 

Related posts

వయనాడ్ విషాదం… కాపాడాలంటూ శిథిలాల కింది నుంచి బాధితుల ఫోన్!

Ram Narayana

త్వరలో అందుబాటులోకి క్యాన్సర్ టీకా: కేంద్రమంత్రి జాదవ్

Ram Narayana

లెక్చరర్ వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య… బీజేపీపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు

Ram Narayana