ఇది దళితుల సమస్య..
- ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ పూరన్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
- ప్రణాళికాబద్ధంగా ఆయన కెరీర్ను దెబ్బతీశారని విమర్శ
- ఇది కుటుంబ సమస్య కాదు, దళితుల సమస్య అని వ్యాఖ్య
- ప్రధాని మోదీ, సీఎం సైనీ వెంటనే స్పందించాలని డిమాండ్
- నిష్పక్షపాత విచారణ జరిపించడంలో హర్యానా సీఎం విఫలమయ్యారని విమర్శ
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ మృతి వెనుక ప్రభుత్వ వివక్ష ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. హర్యానాలో పూరన్ కుమార్ నివాసానికి వెళ్లిన ఆయన, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూరన్ కుమార్ మరణం కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదని, ఇది దళితుల సమస్య అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఆయనపై ప్రణాళికాబద్ధంగా వివక్ష చూపిందని, ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీసి కెరీర్ను నాశనం చేసిందని రాహుల్ ఆరోపించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, నిష్పక్షపాత విచారణ జరిపించడంలో సీఎం సైనీ పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు.
చనిపోయిన తర్వాత కూడా తన భర్తకు సరైన గౌరవం దక్కలేదని పూరన్ కుమార్ భార్య తనతో చెప్పినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఈ నెల 7న తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాజకీయంగా దుమారం రేగుతోంది.
ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో అనూహ్య మలుపు… మరో పోలీసు అధికారి ఆత్మహత్య

- ఏడీజీపీ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో సంచలన మలుపు
- మరో పోలీసు అధికారి ఆత్మహత్య.. చనిపోయే ముందు వీడియో రికార్డ్
- పూరన్ కుమార్ అవినీతిపరుడంటూ వీడియోలో తీవ్ర ఆరోపణలు
- పూరన్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హర్యానా పోలీసులు
హర్యానా పోలీసు శాఖను కుదిపేసిన ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ అవినీతిపై నమోదైన కేసులో దర్యాప్తు చేస్తున్న అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. చనిపోయే ముందు ఆయన మూడు పేజీల సూసైడ్ నోట్, ఒక వీడియోను విడుదల చేశారు.
రోహ్తక్ సైబర్ సెల్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న సందీప్ కుమార్, తన సర్వీస్ రివాల్వర్తో ఒక పొలంలోకి వెళ్లి కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆయన మూడు పేజీల సూసైడ్ నోట్తో పాటు ఒక వీడియో సందేశాన్ని కూడా వదిలివెళ్లారు. “నిజం కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తున్నాను. నేను నిజాయితీ వైపు నిలబడినందుకు గర్విస్తున్నాను. దేశాన్ని మేల్కొల్పడానికి ఇది అవసరం” అని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం.
ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఒక అవినీతిపరుడని, తన అవినీతి బయటపడుతుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని సందీప్ కుమార్ తన లేఖలో ఆరోపించారు. ఒక మద్యం కాంట్రాక్టర్ నుంచి పూరన్ కుమార్ గన్మ్యాన్ రూ. 2.5 లక్షల లంచం తీసుకుంటుండగా తాను పట్టుకున్నానని, ఈ విషయం బయటకు పొక్కడంతో పూరన్ కుమార్ కులం అంశాన్ని తెరపైకి తెచ్చి అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని తీవ్రంగా ఆరోపించారు.
పూరన్ కుమార్ రోహ్తక్ రేంజ్లో బాధ్యతలు చేపట్టాక, నిజాయితీపరులైన అధికారులను పక్కనపెట్టి అవినీతిపరులను నియమించుకున్నారని తన వీడియో సందేశంలో సందీప్ ఆరోపించారు. వారు ఫైళ్లను తొక్కిపెట్టడం, బాధితులను పిలిపించి డబ్బుల కోసం మానసికంగా వేధించడం వంటివి చేసేవారని తెలిపారు. బదిలీల కోసం కొందరు మహిళా పోలీసు సిబ్బందిని లైంగికంగా వాడుకున్నారని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం కులానికి సంబంధించింది కాదని, కేవలం అవినీతికి సంబంధించిందని సందీప్ కుమార్ స్పష్టం చేశారు.