కేసీఆర్ హయాంలోనే కాపులకు పెద్ద పీట..బీసీలకు సముచిత స్థానం..ఎంపీ వద్దిరాజు
కులగణనలో బీసీలకు అన్యాయం …కాపుల జనాభా తగ్గింపు
30 లక్షల మంది బీసీ లను చంపిన రేవంత్ సర్కార్
42 రిజర్వేషన్లపై నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్
మనమందరం మరింత సంఘటితమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మన తడాఖా చూపించాలి …సునీతమ్మను గెలిపించాలి
రేవంత్ రెడ్డి పాలనలో మున్నూరుకాపులు,బీసీలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నన్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.గత ఎన్నికల ముందు నుంచే మున్నూరుకాపులు,బీసీలకు కాంగ్రెస్ తీరని ద్రోహం మొదలుపెట్టిందన్నారు.ఆ పార్టీ కేవలం 19మంది బీసీలకు మాత్రమే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం జరిగిందన్నారు.జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాగంటి సునీతను భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరుతూ షేక్ పేట సీతానగర్ లో మున్నూరుకాపు ప్రముఖులతో ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజ్ శ్రవణ్ కుమార్, కార్తీక్ రెడ్డి,ముఠా జయసింహలతో మంగళవారం రాత్రి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, గత ఎన్నికలలో కాంగ్రెస్ 3గురు మున్నూరుకాపులకు మాత్రమే టిక్కెట్లిస్తే,ఆది శ్రీనివాస్ ఒక్కరే గెలవడం జరిగిందన్నారు. మంత్రివర్గంలో మున్నూరుకాపు,యాదవ,కుర్మ, ముస్లిం,లంబాడలకు చోటివ్వకపోవడం విచారకరమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని ఎంపీ రవిచంద్ర వాపోయారు.

కులగణన సందర్భంగా 30 లక్షల మంది బీసీలను ఈ సర్కార్ చంపేసిందని,ఇందులో సగం మంది మన మున్నూరు కాపులు ఏ ఉండడం శోచనీయమన్నారు. కేసీఆర్ పాలనలో మున్నూరుకాపు సముచిత గౌరవం దక్కిందని, తనతో పాటు కేకే,డీఏస్ గార్లను పెద్దల సభ రాజ్యసభకు పంపారని,బండా ప్రకాష్, బడుగుల లింగయ్య యాదవ్ లు కూడా రాజ్యసభ సభ్యులుగా సేవలందించారని ఎంపీ రవిచంద్ర వివరించారు.మధుసూదనాచారిని స్పీకర్ గా,స్వామి గౌడ్ ను కౌన్సిల్ ఛైర్మన్ గా నియమించారని,జోగు రామన్న, కమలాకర్ గార్లను కేబినెట్ లోకి తీసుకున్నారని బొంతు రాంమోహన్, విజయలక్ష్మీలను మేయర్లను చేసి గౌరవించారని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.ఈ విధంగా చెప్పుకుంటేపోతే కేసీఆర్ ఆరుగురిని ఎమ్మెల్సీలను చేశారని తెలిపారు.బీసీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు 300 మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో గురుకులాలు పెట్టారని, విదేశాలలో చదువుకునే వారికి 20లక్షలు ఉచితంగా అందజేశారని వివరించారు.రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్స్ ఇస్తానని నమ్మించి బీసీల ఓట్లు దండుకుని, ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు.ఈ ఎన్నికల్లో మనమందరం మరింత సంఘటితమై పార్టీని బలోపేతం చేస్తూ ఏకపక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి గట్టిగా బుద్ధి చెబుదామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మున్నూరుకాపు ప్రముఖులు వాసాల వెంకటేష్,ఆర్వీ మహేందర్, తోట వేణుగోపాల్ రావు, మహేష్,అరుణ్,చంద్రయ్య, ప్రవీణ్, వినోద్, రమేష్, రమణారావు,మదన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రను శాలువాతో సత్కరించారు.