శబరిమలలో భక్తుల రద్దీ …కేరళ హైకోర్టు ఆందోళన
రద్దీ నియంత్రణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్న
రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయలేకపోతే విపత్తు తప్పదని హెచ్చరిక
ఒక్క నిమిషంలో 80 మందిని దర్శనానికి అనుమతించాల్సిన అవసరం ఏంటి?.
ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుపై ఆగ్రహం
శబరిమలలో నెలకొన్న భక్తుల రద్దీపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ జరగరానిది జరిగితే ఏం చేస్తారంటూ ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుపై ధ్వజమెత్తింది…
పవిత్ర వృశ్చిక మాసంలో మండల-మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర ఆదివారం సాయంత్రం మొదలైంది. కొండకు అయ్యప్ప భక్తులు పోటెత్తగా.. ఓ భక్తురాలు మంగళవారం క్యూ లైన్లోనే స్పృహ కోల్పోయి మృతి చెందింది. ఈ దరిమిలా భక్తుల రద్దీపై విచారణ జరిపిన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఆలయం తెరిచిన 48 గంట్లోనే సుమారు 2 లక్షల మంది శబరిమలకు చేరుకున్నారు. వాళ్లలో పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా భక్తులు రావడంతో రద్దీపై నియంత్రణ కోల్పోయినట్లైంది. భక్తులను అలా హడావిడిగా లోపలికి, బయటకు పంపడమేంటి?.. కేవలం ఒక్క నిమిషంలో 80 మందిని దర్శనానికి అనుమతించాల్సిన అవసరం ఏంటి?. రద్దీకి తగ్గ ఏర్పాట్లు చేయలేకపోతే విపత్తు తప్పదు.
అసలు ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు?.. అని ప్రశ్నించింది. దీనిపై శుక్రవారం లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో వర్చువల్ క్యూ స్లాట్లు తగ్గించకపోవడాన్ని సైతం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
స్పాట్ బుకింగ్ ద్వారా భక్తుల సంఖ్యను నియంత్రించాల్సి ఉన్నా.. అధికార యంత్రాంగం ఆ విషయంలో ఘోరంగా విఫలమైంది. అదనంగా 10 వేల మంది కొండ ఎక్కారని స్వయంగా దేవస్థానం బోర్డే అంగీకరించింది. ఇది భద్రతా ప్రమాణాలకు విరుద్ధమే కదా. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రభుత్వాన్ని, టిడిబి ని ప్రశ్నించింది. భక్తుల భద్రతకు ముప్పు కలిగే విధంగా అనవసర రద్దీని ప్రోత్సహించకూడదని స్పష్టం చేసింది.