జాతీయ రాజకీయ వార్తలు

నన్ను సవాల్ చేయాలని చూడొద్దు: బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక!

  • ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ
  • తనతో రాజకీయంగా పోరాడే శక్తి బీజేపీకి లేదని వ్యాఖ్య
  • బెంగాల్‌లో తనను ఓడించడం ఆ పార్టీకి సాధ్యం కాదన్న మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లో తనను సవాల్ చేసే ప్రయత్నం చేయవద్దని బీజేపీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరిక జారీ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనతో రాజకీయంగా పోరాడే శక్తి బీజేపీకి లేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో తనను ఓడించడం ఆ పార్టీకి సాధ్యం కాదని తేల్చిచెప్పారు.

బెంగాల్‌లో తనకు సవాల్ విసిరేందుకు ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ పునాదులను కదిలిస్తానని హెచ్చరించారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అది బీజేపీ కమిషన్‌గా మారిందని ఆరోపించారు. బీహార్‌లో బీజేపీ వ్యూహాలను అక్కడి ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ కారణంగానే బీహార్ ఎన్నికల ఫలితాలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా వచ్చాయని అభిప్రాయపడ్డారు.

అక్రమంగా దేశంలో ఉంటున్న బంగ్లాదేశీయులను తొలగించడమే ఎస్ఐఆర్ లక్ష్యమైతే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో కూడా చొరబాటుదారులు ఉన్నట్లు వారు అంగీకరిస్తున్నారా అని నిలదీశారు. బెంగాల్‌లో ఎస్ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటరు జాబితా వెలువడ్డాక ఈసీ, బీజేపీ సృష్టించిన గందరగోళాన్ని ప్రజలే గుర్తిస్తారని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియను రెండు మూడు సంవత్సరాలు నిర్వహిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె స్పష్టం చేశారు.

Related posts

కాంగ్రెస్‌తో పొత్తుకు మమత ససేమిరా..పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ !

Ram Narayana

మహారాష్ట్ర ప్రభుత్వంలో లుకలుకలు..

Ram Narayana

నన్ను తిట్టినా భరిస్తాను… కానీ…!: ప్రధాని మోదీ!

Ram Narayana