- గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు
- 15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు కొట్టిన బిల్ గేట్స్ విమానం
- వాతావరణం మెరుగుపడిన తర్వాత ఏటీసీ సూచనలతో విమానం సురక్షితంగా ల్యాండింగ్
వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం సుమారు 15 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఉదయం వేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఎయిర్ పోర్ట్ రన్వే స్పష్టంగా కనిపించకపోవడంతో ల్యాండింగ్ సమస్య ఎదురైంది.
ఉదయం సమయంలో గన్నవరం పరిసరాల్లో పొగమంచు తీవ్రంగా ఉండటంతో విమానాల రాకపోకలకు అవసరమైన విజిబిలిటీ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నప్పటికీ..పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఏటీసీ ల్యాండింగ్ అనుమతి ఇవ్వలేదు. దీంతో పైలట్లు విమానాన్ని గాలిలోనే ఉంచి సుమారు 15 నిమిషాలపాటు చక్కర్లు కొట్టించారు. అనంతరం వాతావరణం కాస్త మెరుగుపడడంతో ఏటీసీ సూచనల మేరకు విమానం సురక్షితంగా రన్వేపై ల్యాండ్ అయింది.
ఏపీ ప్రభుత్వంతో సంజీవని వైద్య సేవలతో పాటు కొన్ని కీలక సామాజిక ప్రాజెక్టులపై చర్చల కోసం బిల్ గేట్స్ అమరావతి పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన చేసే ప్రకటనలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.