- విచారణ పూర్తయ్యే వరకు రామ్మోహన్ నాయుడుతో పాటు డీజీసీఏ అధికారులను తప్పించాలని డిమాండ్
- కుట్ర పూరిత కోణంలోనూ ప్రమాదంపై దర్యాప్తు జరపాలన్న రోహిత్ పవార్
- కంపెనీ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్
గత నెలలో బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ మరణంపై విచారణ పూర్తయ్యే వరకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, డీజీసీఏ ఉన్నతాధికారులను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీ శాసనసభ్యుడు రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ విమాన ప్రమాదంపై కుట్రపూరిత కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోరారు.
ఈ ప్రమాదానికి సంబంధించి కంపెనీ యాజమాన్యం, విమానం ఫిట్గా ఉందని నిర్ధారించిన సాంకేతిక సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా సీబీఐ దీనిని దర్యాప్తు చేయాలని అన్నారు.
భద్రతా సమస్యల కోణంలోనూ విచారణ జరగాలని, దీనిని సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీ నాయకులు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిశారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ (శరద్ పవార్) వర్గం కూడా సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసింది.
వీఎస్ఆర్ వెంచర్స్ నడుపుతున్న ఈ విమానాల్లో గతంలోను భద్రతా లోపాలు తలెత్తాయని, కాబట్టి వారి విమానాలను నిలిపివేయాలని రోహిత్ పవార్ కోరారు. ఫ్లైట్ రికార్డర్ దెబ్బతిన్నట్లు వచ్చిన వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానంలోని చివరి క్షణాలకు సంబంధించిన ఆధారాలను నాశనం చేయడానికి ఇది ఒక స్క్రిప్ట్ అని ఆరోపించారు. ప్రమాదవశాత్తు విమానం కూలిపోవచ్చు కానీ కుట్ర కోణంలో దర్యాప్తు చేయాలని ఆయన అన్నారు.