- భారత్లో వేగవంతమైన మార్పును చూస్తున్నానన్న సుందర్ పిచాయ్
- విద్యార్థిగా ఉన్నప్పుడు ఐఐటీ ఖరగ్పూర్కు విశాఖ మీదుగా వెళ్లేవాడినన్న సుందర్ పిచాయ్
- ఇప్పుడు అదే విశాఖలో గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్ ఏర్పాటవుతోందని వెల్లడి
తాను భారతదేశంలో సందర్శించిన ప్రతిసారి, వేగవంతమైన మార్పును చూసి ఆశ్చర్యపోతున్నానని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. తన తాజా భారత సందర్శన కూడా అందుకు భిన్నమేమీ కాదని, భారత్లో మార్పుల వేగం చూస్తున్నానని అన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్’ సదస్సులో ఆయన మాట్లాడుతూ, కొత్త ఆవిష్కరణలు ఆర్థిక ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపిస్తాయని అన్నారు.
తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఐఐటీ ఖరగ్పూర్కు విశాఖపట్నం మీదుగా వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు అదే విశాఖలో గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్ ఏర్పాటవుతోందని అన్నారు. విశాఖలో ఏర్పాటు చేయనున్న ఏఐ హబ్లో కంప్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సబ్ సీ కేబుల్ గేట్ వే ఉంటాయని తెలిపారు. ఇది భారతదేశంలో ఉద్యోగాలను సృష్టించడంతో పాటు ‘ఏఐ’ సాంకేతికతను విస్తరిస్తుందని అన్నారు. భారతదేశం సాంకేతికత, డిజిటల్ మౌలిక సదుపాయాలలో ఎంతటి పురోగతి సాధించిందో దీనిని బట్టి అర్థమవుతోందని వెల్లడవుతోందని అన్నారు.
ఏఐ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలకు భారత్ సాక్షిగా నిలుస్తోందని అన్నారు. ప్రపంచంలో జరిగే వాటిలో భారత్ నుంచే సగం డిజిటల్ లావాదేవీలు ఉన్నాయని తెలిపారు. భారతదేశాన్ని ఏఐ కేంద్రంగా ప్రధానమంత్రి తీర్చిదిద్దుతున్నారని కితాబునిచ్చారు. సెమీకాన్ ఇండియా, ఇండియా ఏఐ మిషన్లో భాగంగా సాంకేతికత అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఏఐ కృత్రిమమేమీ కాదని వాస్తవికమైనదని గుర్తించాలని అన్నారు.