- హెరిటేజ్ ప్రామిస్ పేరుతో వీడియో విడుదల చేసిన నారా భువనేశ్వరి
- 33 ఏళ్లుగా నాణ్యతలో రాజీ పడలేదని స్పష్టీకరణ
- ప్రతి ఉత్పత్తికి 25 నాణ్యత పరీక్షలు తప్పనిసరి అని వెల్లడి
- మూడు లక్షల మంది రైతులకు న్యాయమైన ధర అందిస్తున్నామని వివరణ
- చూసిందే నమ్మాలంటూ వినియోగదారులకు పిలుపు
హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తమ సంస్థ నాణ్యతా ప్రమాణాలపై వినియోగదారులకు భరోసా ఇస్తూ ‘హెరిటేజ్ ప్రామిస్’ పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. ‘చూసిందే నమ్మండి’ అనే నినాదంతో విడుదలైన ఈ వీడియోలో కంపెనీ పనితీరు, రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను ఆమె వివరించారు.
గత 33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా హెరిటేజ్ పనిచేస్తోందని భువనేశ్వరి తెలిపారు. రూ.4 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన సంస్థ, నేడు రూ.4,000 కోట్ల స్థాయికి ఎదిగినా నాణ్యత విషయంలో ఎన్నడూ రాజీ పడలేదని ఆమె స్పష్టం చేశారు. వినియోగదారుల ఇంటికి చేరే ప్రతి ఉత్పత్తి 25 కఠినమైన నాణ్యతా పరీక్షలు దాటిన తర్వాతే వస్తుందని, 500 మందికి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను నిరంతరం పర్యవేక్షిస్తారని ఆమె పేర్కొన్నారు.
తొమ్మిది రాష్ట్రాల్లోని సుమారు 3 లక్షల మంది పాడి రైతులతో తమ సంస్థ కలిసి పనిచేస్తోందని భువనేశ్వరి వివరించారు. పారదర్శకత, న్యాయమైన ధర, సకాలంలో చెల్లింపులు అనే సూత్రాలతో రైతులకు సాధికారత కల్పిస్తున్నామని అన్నారు. ఈ వీడియోను పూర్తిగా చూసి, వాస్తవాలను స్వయంగా తెలుసుకోవాలని ఆమె ప్రజలను కోరారు.