మున్సిపల్ ఫలితాలపై సీఎంను మంత్రులను ,ప్రశంసించిన ఖర్గే ,రాహుల్ గాంధీ ..
ఢిల్లీలోని ఖర్గే నివాసంలో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు
భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలిపిన మల్లికార్జున ఖర్గే
సమానత్వంతో కూడిన తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటన
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అభినందించారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ , మంత్రులు శ్రీధర్ బాబు , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణరావు, సురేఖ ,వివేక్ ఆయనను కలిశారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితాలపై రాహుల్ గాంధీ, ఖర్గే అభినందించారు.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించామని అన్నారు. తెలంగాణకు పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలుచేస్తామని స్పష్టం చేశారు. సమానత్వంతో కూడిన తెలంగాణ నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రజా తెలంగాణ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు.