- బాలురపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు
- కోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రయాగ్రాజ్ పోలీసులు
- ఇది తన ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్ర అని ఖండించిన స్వామీజీ
ఆధ్యాత్మిక గురువు, జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాలురపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదుతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సన్యాస లోకంలో తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రయాగ్రాజ్లో జరిగిన మాఘమేళాతో పాటు గురుకులంలో గత ఏడాది కాలంగా ‘గురుసేవ’ పేరుతో తమపై లైంగిక దాడి జరిగిందని ఇద్దరు బాలురు ఆరోపించారు. వీరిలో ఒకరు మైనర్. బాధితుల తరపున స్వామి రామభద్రాచార్య శిష్యుడు అశుతోష్ బ్రహ్మచారి మహరాజ్ ప్రయాగ్రాజ్లోని పోక్సో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఝున్సీ పోలీసులు శనివారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా శంకరాచార్య అవిముక్తేశ్వరానందను పేర్కొన్న పోలీసులు, ఆయన శిష్యుడు ముకుందానంద బ్రహ్మచారితో పాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు.
మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలను స్వామి అవిముక్తేశ్వరానంద తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ తప్పుడు కేసు నమోదు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బాధితుల వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక పీఠాధిపతిపై పోక్సో కేసు నమోదు కావడం ఉత్తరప్రదేశ్లో రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.