- ‘‘మనం అతిగా గెలుస్తున్నాం” అంటూ ట్రూత్ సోషల్ లో సందేశం
- అమెరికాలోకి మాదకద్రవ్యాలు పంపే వారికి శిక్ష తప్పదని వార్నింగ్
- అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన ట్రంప్ పోస్ట్
మెక్సికోలో అత్యంత శక్తిమంతమైన ‘జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్’ అధిపతి నెమీసియో ఒసెగువేరా (60) అలియాస్ ‘‘ఎల్ మెంచో’’ మెక్సికన్ ప్రత్యేక దళాల ఆపరేషన్లో గాయపడి, బలగాల కస్టడీలో మరణించాడు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన ట్రూత్ సోషల్లో ‘‘మనం అతిగా గెలుస్తున్నాం, ఇది అసలు న్యాయమే కాదు!” అంటూ పెట్టిన క్లుప్తమైన సందేశం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
అమెరికా నిఘా వర్గాల సహకారం..
మెక్సికోలోని తపాల్పాలో జరిగిన ఈ మెరుపు దాడిలో ఎల్ మెంచో పట్టుబడ్డాడు. అమెరికా నిఘా వర్గాల సహకారంతో మెక్సికో సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఎల్ మెంచో మృతి వార్తతో మెక్సికోలోని ఆరు రాష్ట్రాల్లో డ్రగ్ గ్యాంగ్లు విధ్వంసానికి దిగాయి. వాహనాలను తగులబెట్టడం, రహదారుల దిగ్బంధనంతో పర్యాటక ప్రాంతాలు యుద్ధ క్షేత్రాలను తలపించాయి.
ట్రంప్ హెచ్చరిక..
అమెరికాలోకి డ్రగ్స్ పంపే నార్కో ఉగ్రవాదులు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేసింది. గతంలో పట్టుబడ్డ ‘ఎల్ చాపో’ వంటి వారి సరసన ఎల్ మెంచో మృతి కూడా మెక్సికో డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మెక్సికో అంతటా భద్రతా దళాలను మోహరించారు. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.