జాతీయ రాజకీయ వార్తలు

జల్లికట్టు ఎద్దులా తమిళనాడు రాజకీయం.. స్టాలిన్ కు, నాకు మధ్యనే ప్రత్యక్ష పోరు: విజయ్

  • తమిళనాడు రాజకీయాలను జల్లికట్టు ఎద్దుతో పోల్చిన దళపతి
  • నెలవారీ కరెంట్ బిల్లుల హామీపై డీఎంకే ప్రభుత్వాన్ని నిలదీత
  • అవినీతిపై పోరాడుతున్నందుకే అందరూ త‌న‌ను వ్యతిరేకిస్తున్నారన్న విజయ్

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లతో విరుచుకుప‌డ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలకు సంబంధించినవి కావని, రాష్ట్రంలోని అవినీతి, పాలనకు సంబంధించినవని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు విజయ్, స్టాలిన్‌ల మధ్య ప్రత్యక్ష పోరాటమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ‌ వెల్లూరు జిల్లా కొల్లమంగళంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో జరిగిన అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడారు.

“స్పష్టంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు విజయ్, స్టాలిన్‌ల మధ్య యుద్ధం. ఇది తమిళనాడు ప్రజలకు, అవినీతికి మధ్య… ప్రజలకు, లంచగొండితనానికి మధ్య… ప్రజలకు, డీఎంకే ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం” అని విజయ్ అన్నారు. ఓటు తమ హక్కు అని, దానిని ఎవరూ కొనలేరని ఆయన స్పష్టం చేశారు.

తమిళనాడు రాజకీయ పరిస్థితిని వివరిస్తూ ఆయన ఓ జల్లికట్టు ఎద్దు కథను ఉదాహరణగా చెప్పారు. “ఆ కథలో ఎద్దు తమిళనాడు రాజకీయ పరిస్థితికి ప్రతీక. దానితో పోరాడే అబ్బాయి కేవలం నేను కాదు, మనమందరం. మార్పు కోసం ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు వారికి పరిష్కారాలు కావాలి కానీ భయం కాదు” అని వివరించారు.

నెలవారీ కరెంట్ బిల్లుల హామీ ఏమైందని విజయ్ డీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాంతిభద్రతలు, మహిళల భద్రత, కొండ గ్రామాల్లో బస్సు సౌకర్యాల కొరత, వైద్య సదుపాయాలు లేకపోవడం వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. తమ ప్రభుత్వంలో అమ్మాయిలు, అబ్బాయిల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత తమ ఆస్తుల వివరాలను నేతలు ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. తనను ‘స్నేహితుడు’ అని స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… “నేనే మీ స్నేహితుడినైతే వివాదాల్లోకి నా పేరు ఎందుకు లాగుతున్నారు?” అని ప్రశ్నించారు. అవినీతిని వ్యతిరేకిస్తున్నందుకే అందరూ తనను టార్గెట్ చేస్తున్నారని, ప్రతి పోలింగ్ బూత్ విజయం సాధించే బూత్‌గా మారాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి క్యూఆర్ కోడ్ పాసులు ఉన్న 4,900 మందిని మాత్రమే అనుమతించారు.

Related posts

ఇందిరాగాంధీ పేరుందని స్కూలు మారాడట.. మహా సీఎం ఫడ్నవీస్ చిన్ననాటి సంఘటన!

Ram Narayana

సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తిరిగి రాజా!

Ram Narayana

మోదీ వ్యాఖ్యలపై దుమారం.. అసలు అప్పట్లో మన్మోహన్ ఏమన్నారంటే?..

Ram Narayana