- పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం ఆ పార్టీ నేతలకు అలవాటేనని ఎద్దేవా
- ఎన్నికల్లో తనను ఓడించాలని స్టాలిన్ కుట్ర పన్నుతున్నారని విమర్శ
- డీఎంకేకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనన్న విజయ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని స్టాలిన్ ప్రభుత్వం చూస్తోందని ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులకు అనుగుణంగా మారిపోవడం ఆ పార్టీ నేతలకు అలవాటేనని వ్యాఖ్యానించారు. వేలూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో తనను ఎలాగైనా ఓడించాలనే ఆలోచనతో స్టాలిన్ కుట్రలు పన్నుతున్నారని అన్నారు. డీఎంకేకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు.
ప్రభుత్వాల అవినీతిని ప్రశ్నిస్తున్నందువల్లే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని విజయ్ అన్నారు. తమ పార్టీ నిర్వహించే బహిరంగ సభలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. అందువల్లే తాను అన్ని ప్రాంతాల ప్రజలను కలవలేకపోతున్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు.
తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వెనక్కి తగ్గేది లేదని అన్నారు. అవినీతిని ప్రశ్నించడం ఆపేది లేదని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలను అరికట్టడంలో స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు ప్రజలకు, అవినీతి ప్రభుత్వానికి యుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ యుద్ధంలో ప్రజలు విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.