- బీజేపీ ఎంపీ నాగేన్ రాయ్కి ‘బంగ విభూషణ్’ పురస్కారం
- రాజ్ బాంగ్షీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు నాగేన్ రాయ్
- ఉత్తర, మధ్య బెంగాల్లో పెద్ద సంఖ్యలో ఈ వర్గం ప్రజలు
పశ్చిమ బెంగాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం ఒక బీజేపీ ఎంపీకి రాష్ట్ర పురస్కారం అందించడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎంపీ నాగేన్ రాయ్ సహా పలువురికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర పౌర పురస్కారం ‘బంగ విభూషణ్’ అందించారు.
బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొని ఉంది. ఇలాంటి తరుణంలో బీజేపీ ఎంపీకి పురస్కారం అందించడం గమనార్హం.
నాగేన్ రాయ్ రాజ్ బాంగ్షీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఉత్తర, మధ్య బెంగాల్లో ఈ వర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో టీఎంసీ పేలవ ప్రదర్శన కనబరచగా, బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి.
2023లో నాగేన్ రాయ్ రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. రాజ్ బాంగ్షీ వర్గం ప్రజలు ఆయనను అనంత్ మహారాజ్గా పిలుచుకుంటారు. ముర్షిదాబాద్, మాల్దా, డార్జిలింగ్, ఉత్తర్ దీనాజ్పూర్, జల్ పాయ్ గుడీ వంటి ప్రాంతాల్లో రాజ్ బాంగ్షీ ప్రజలు ఉన్నారు. ఈ వర్గంలో బీజేపీ ఎంపీకి పలుకుబడి ఉంది. ఇప్పుడు ఎన్నికలు సమీపించిన సమయంలో ఆ సామాజిక వర్గం బీజేపీ ఎంపీకి పురస్కారం ఇవ్వడం గమనార్హం.
నాగేన్ గతంలో టీఎంసీకి దగ్గరగా ఉండేవారనే వాదనలు ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీకి చేరువయ్యారు. ఆయన బీజేపీ ఎంపీ అయ్యాక కూడా మమతా బెనర్జీ ఒకసారి ఆయన ఇంటిని సందర్శించారు. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై నాగేన్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు.