జాతీయ వార్తలు

కేరళ ఇకపై ‘కేరళం’.. పేరు మార్పు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం…

  • కేరళ పేరును ‘కేరళం’గా మార్చేందుకు కేంద్రం ఆమోదం
  • కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
  • మలయాళ ఉచ్చారణకు అనుగుణంగా పేరు మార్పు ప్రతిపాదన
  • రాజ్యాంగ సవరణ ద్వారా అధికారికంగా మారనున్న పేరు

కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో కేరళ ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరనుంది.

మలయాళ భాషలో కేరళ రాష్ట్రాన్ని ‘కేరళం’ అనే పిలుస్తారు. ఈ స్థానిక ఉచ్చారణకు అనుగుణంగా అధికారిక పేరును కూడా మార్చాలని కోరుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం 2024 జూన్ 24న శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనకే ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గతంలో 2023లోనూ ఇలాంటి తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత ఈ ప్రక్రియ మరో దశకు చేరుతుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, రాష్ట్రపతి ‘కేరళ (పేరు మార్పు) బిల్లు, 2026’ను రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపుతారు. అక్కడి నుంచి ఆమోదం లభించాక, ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా పేరు మార్పు అధికారికంగా అమల్లోకి వస్తుంది.

వచ్చే ఏప్రిల్-మే నెలల్లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఒరిస్సాను ‘ఒడిశా’గా, పాండిచ్చేరిని ‘పుదుచ్చేరి’గా మార్చిన తరహాలోనే ఇప్పుడు కేరళ పేరు కూడా మారుతోంది.

Related posts

కేరళ సీఎం పినరయి విజయన్ కు ఈడీ షోకాజ్ నోటీసులు…

Ram Narayana

లారెన్స్ బిష్ణోయ్ ని ఎన్ కౌంటర్ చేసే పోలీసు అధికారికి రూ. 1.11 కోట్లు ఇస్తాం: కర్ణిసేన చీఫ్

Ram Narayana

బీజేపీ సభలో హైడ్రామా.. నేతను చితకబాదిన మహిళ…

Ram Narayana