టి 20 మ్యాచ్ లు

ఫోన్, సోషల్ మీడియా బంద్.. నన్ను నేను నమ్ముకున్నా: సంజూ శాంసన్

  • వెస్టిండీస్‌పై 97 పరుగులతో భారత్‌ను గెలిపించిన సంజూ శాంసన్
  • పేలవ ఫామ్ సమయంలో ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని వెల్లడి
  • తనపై తనకు నమ్మకంతో, ఆత్మశోధనతో తిరిగి ఫామ్‌లోకి వచ్చానన్న స్టార్ బ్యాట‌ర్‌

టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించిన ఓపెనర్ సంజూ శాంసన్, తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సమయంలో తనపై తనకు నమ్మకాన్ని కాపాడుకునేందుకు ఫోన్, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పాడు. తన అంతరాత్మను వినడం ద్వారానే తిరిగి ఫామ్‌లోకి రాగలిగానని, కీలక మ్యాచ్‌లో జట్టును గెలిపించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.

వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి భారత్‌కు 5 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం ముంబైలో ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన శాంసన్… “పేలవ ఫామ్‌లో ఉన్నప్పుడు ‘నేను చేయగలనా? నా వల్ల కాదు’ లాంటి ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి. అలాంటప్పుడు వాటిని సానుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాను. న్యూజిలాండ్ సిరీస్‌లో విఫలమైనప్పుడు చాలా నిరాశ చెందాను. ఆ తర్వాత దొరికిన 10 రోజుల విరామంలో నా ఆట గురించి ఆత్మశోధన చేసుకున్నాను. నా టెక్నిక్‌పై చాలామంది సలహాలు ఇచ్చినా, ఇదే టెక్నిక్‌తో మూడు అంతర్జాతీయ సెంచరీలు చేశానని గుర్తుచేసుకుని, నాపై నేను నమ్మకం ఉంచుకున్నాను” అని వివరించాడు.

ఛేదన గురించి మాట్లాడుతూ… “వికెట్లు వరుసగా పడుతుండటంతో మ్యాచ్ కఠినంగా మారింది. ఆ సమయంలో అనుభవాన్ని ఉపయోగించి, చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాలని నిర్ణయించుకున్నాను. ఒత్తిడిలో సిక్సర్ల కంటే బౌండరీలపై దృష్టి పెట్టాను. బంతి బ్యాట్‌పైకి బాగా వస్తుండటంతో టైమింగ్‌తో ఆడాను” అని చెప్పాడు.

“భారత్‌లో ఎందరో క్రికెటర్లు ఇలాంటి రోజు కోసం కలలు కంటారు. కేరళలోని ఓ చిన్న పట్టణం త్రివేండ్రం నుంచి వచ్చిన నేను కూడా దేశం కోసం ఆడి, కీలక మ్యాచ్ గెలిపించాలని కలలు కన్నాను. ఆ కల ఈ రోజు నిజమైంది” అంటూ శాంసన్ భావోద్వేగంగా మాట్లాడాడు.

Related posts

టీ20 ప్రపంచకప్ లో భారత్ తో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నాం: పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన…

Ram Narayana

ఒత్తిడిలో సంజూ క్లాస్ ఇన్నింగ్స్.. పాక్ ఫ్యాన్స్ ఫిదా!

Ram Narayana

బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ టీమ్ … స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

Ram Narayana