అంతర్జాతీయం

అతిపెద్ద సౌదీ ఆయిల్ రిఫైనరీపై దాడి.. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలియం ధరలు పెరిగే అవకాశం..

  • ఆరాంకో చమురుశుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడి
  • దాడి కారణంగా కార్యకలాపాలను తాత్కాలికంగా ఆపేసిన అరాంకో
  • 13 శాతం పెరిగిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర

పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణి, డ్రోన్ దాడులతో గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. ఈ ఉదయం సౌదీ అరాంకోకు చెందిన అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం ‘రాస్ తనూరా’పై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడంతో సౌదీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ దాడి కారణంగా సౌదీ అరాంకో తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. సౌదీ రక్షణ శాఖ ఈ డ్రోన్లను అడ్డుకున్నట్లు ప్రకటించినప్పటికీ, ప్లాంట్ వద్ద అగ్నిప్రమాదం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. కేవలం సౌదీ అరేబియానే కాకుండా యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులను ముమ్మరం చేసింది.

ఈ దాడుల ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన ‘హోర్ముజ్ జలసంధి’ గుండా నౌకల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా షిప్పింగ్ కంపెనీలు తమ సేవలను నిలిపివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. దీని ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక్కసారిగా 13 శాతం పెరిగి బ్యారెల్‌కు 80 డాలర్లకు చేరుకుంది. ఒకవేళ ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే చమురు ధర 100 డాలర్లను దాటవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇరాన్ దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. తమ భూభాగాన్ని లేదా గగనతలాన్ని ఇరాన్ పై దాడులకు అనుమతించేది లేదని తాము అమెరికా, ఇజ్రాయెల్ లకు స్పష్టం చేసినప్పటికీ… తమపై ఇరాన్ దాడులకు దిగిందని సౌదీ అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది.

Related posts

 ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ వల్ల భార్య అరెస్టు..

Ram Narayana

కెనడాను అమెరికాలో విలీనం చేసుకుంటాం.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట!

Ram Narayana

భారత్‌పై టారిఫ్‌లు ఇంకా పెంచుతానంటున్న ట్రంప్…

Ram Narayana