తెలుగు రాష్ట్రాలు

బొత్సకు మళ్లీ అస్వస్థత… పరిస్థితి గమనించి సూచన చేసిన పయ్యావుల!

  • శాసనమండలిలో ప్రసంగిస్తుండగా బొత్సకు అస్వస్థత
  • విషయం గమనించి విశ్రాంతి తీసుకోవాలన్న మంత్రి పయ్యావుల
  • వెంటనే మండలికి చేరుకుని పరీక్షలు చేసిన వైద్యులు
  • బీపీలో హెచ్చుతగ్గుల వల్లే ఇబ్బంది పడ్డారని వెల్లడి
  • ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డాక్టర్లు

వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శాసనమండలిలో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు.

బొత్స ఇబ్బందిని గుర్తించిన మంత్రి పయ్యావుల.. ప్రసంగాన్ని కాసేపు నిలిపివేసి, కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ అధికారులు వెంటనే వైద్యులను మండలికి పిలిపించారు. అక్కడికి చేరుకున్న వైద్య బృందం అసెంబ్లీ ఆవరణలోని డిస్పెన్సరీలో బొత్సకు పలు రకాల పరీక్షలు నిర్వహించింది. రక్తపోటు (బీపీ)లో హెచ్చుతగ్గుల కారణంగానే బొత్స అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు విశ్రాంతి చాలా అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.

అస్వస్థత నేపధ్యంలో అసెంబ్లీ వైద్యులు.. బొత్సకు రెగ్యులర్ గా చికిత్స అందించే స్పెషలిస్ట్ డాక్టర్లతోనూ మాట్లాడారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ముందస్తు జాగ్రత్తగా, మెరుగైన వైద్య చికిత్స కోసం బొత్సను హైదరాబాద్ కు తరలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవలే బొత్స అనారోగ్య సమస్యలతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.

Related posts

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి పవన్ కల్యాణ్ తప్పు చేశారు: చింతా మోహన్

Ram Narayana

గద్దర్ స్మారకంగా ప్రభుత్వం ఏదైనా ఏర్పాటు చేయాలి: సీపీఐ నారాయణ

Ram Narayana

తిరుమల కాలినడక మార్గంలో భక్తులకు చేతికర్రలను పంపిణీ చేసిన టీటీడీ

Ram Narayana