- ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న శ్రీలంక
- లీటర్ పెట్రోల్ ధరపై రూ. 25 పెంచిన లంక
- ఇప్పటికే పెట్రోల్ ధరను భారీగా పెంచిన పాకిస్థాన్
ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే సతమతమవుతున్న శ్రీలంకలో ఇంధన ధరల పెరుగుదల సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం చూపడంతో, ఈ రెండు దేశాలు తమ దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాల్సి వచ్చింది. పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
శ్రీలంకలో పెరిగిన ధరల వివరాలు (లీటరుకు):
- ఆక్టేన్ 92 పెట్రోల్: రూ. 317 (రూ. 24 పెరుగుదల)
- ఆక్టేన్ 95 పెట్రోల్: రూ. 365 (రూ. 25 పెరుగుదల)
- ఆటో డీజిల్: రూ. 303 (రూ. 22 పెరుగుదల)
- సూపర్ డీజిల్: రూ. 353 (రూ. 24 పెరుగుదల)
- కిరోసిన్: రూ. 195 (రూ. 13 పెరుగుదల)
మరోవైపు, శ్రీలంక కంటే ముందే పాకిస్థాన్ ప్రభుత్వం ఇంధన ధరలను లీటరుకు ఏకంగా రూ. 55 వరకు పెంచి ప్రజలను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగి, పండ్లు, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇది ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచి, సామాన్యుల జీవన ప్రమాణాలను దిగజార్చేలా చేస్తుంది.