జనరల్ వార్తలు ...

కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్మేశారు.. వెలుగులోకి అమానవీయ ఘటన…

  • మెదక్‌లో వెలుగు చూసిన దారుణ‌ ఘటన
  • డబ్బుల కోసం వారం రోజుల బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు
  • రూ.1.7 లక్షలకు కామారెడ్డి దంపతులకు విక్రయం
  • అంగన్‌వాడీ టీచర్ చొరవతో బయటపడ్డ దారుణం

మెదక్ జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్ముకున్నారు ఓ దంపతులు. పుట్టిన వారం రోజులకే తమ మగబిడ్డను విక్రయించి మానవత్వానికే మచ్చ తెచ్చారు.

వివరాల్లోకి వెళితే… హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాకు చెందిన ఓ గిరిజన దంపతులకు గత నెల 10న మగబిడ్డ జన్మించాడు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ పసికందును వారం రోజులకే కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులకు అమ్మేశారు. ఈ దారుణం అంగన్‌వాడీ టీచర్ చొరవతో బయటపడింది. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి అంగన్‌వాడీ కేంద్రానికి గుడ్లు, ఇతర పోషకాహారం కోసం రాకపోవడంతో టీచర్‌కు అనుమానం వచ్చింది.

ఆరా తీసేందుకు ఆమె వారి ఇంటికి వెళ్లగా, తాళం వేసి ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు దర్యాప్తు చేపట్టగా, ఆ గిరిజన దంపతులు మరో గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. వారిని పట్టుకుని బిడ్డ గురించి ఆరా తీయగా, అసలు నిజం ఒప్పుకున్నారు. బిడ్డను రూ.1.7 లక్షలకు కామారెడ్డి దంపతులకు అమ్మేసినట్లు తెలిపారు.

దీంతో అధికారులు వారిని హవేలీఘనాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

The top street style trends of spring 2018 fashion month

Ram Narayana

3,395 కరోనా కేసులు.. ఆందోళన అవసరం లేదంటున్న నిపుణులు!

Ram Narayana

 మీ ఫోన్ ఒకేసారి పెద్దగా మోగితే.. భయపడొద్దు!

Ram Narayana