- వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల పక్షాన నిలబడ్డ తనను అరెస్ట్ చేశారన్న కవిత
- అర్ధరాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించడంపై ఆగ్రహం
- ఇళ్లను కూల్చివేసిన చోటే కొత్త ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. నిరాహార దీక్షకు దిగిన తనను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పేదల కోసం గళమెత్తిన తనను ఒక ఉగ్రవాదిలా భావించి అరెస్ట్ చేశారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు.
హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కవిత, వెలుగుమట్లలో పేదలు కష్టపడి కట్టుకున్న ఇళ్లను అధికారులు కర్కశంగా కూల్చివేసిన తీరును తప్పుబట్టారు. భూదాన్ భూములు అంటేనే పేదలకు ఇచ్చేవి అని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ భూములను పెద్దలకు కట్టబెట్టేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. కూల్చివేసిన చోటే మళ్లీ ఇళ్లను నిర్మించి బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ, ఖమ్మంలో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న తీరును గమనించాలని కవిత సూచించారు. ఈ అన్యాయంపై ఆయనకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. బాధితుల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఉన్నారని, పరీక్షల సమయంలో వారిని రోడ్డున పడేయడం కలెక్టర్, జిల్లా మంత్రులకు కనిపించడం లేదా? అని ఆమె నిలదీశారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని, అవసరమైతే కోర్టులో పిల్ వేసి న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.