- జమ్మూలో ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం
- వివాహ వేడుకలో అత్యంత సమీపం నుంచి కాల్పులు
- అప్రమత్తమై దాడిని అడ్డుకున్న ఎన్ఎస్జీ కమాండోలు
- భద్రతా వైఫల్యంపై కుమారుడు ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆందోళన
- నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా (88) హత్యాయత్నం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. జమ్మూలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఉన్న రాయల్ పార్క్లో నిన్న సాయంత్రం ఓ వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు ఆయనపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది అప్రమత్తమై దాడిని విఫలం చేశారు.
వివరాల్లోకి వెళితే… ఫరూక్ అబ్దుల్లా వేడుకలో ఉండగా, ఓ వ్యక్తి ఆయనకు అత్యంత సమీపంగా వెనుక నుంచి వచ్చాడు. తుపాకీతో ఫరూక్పై గురిపెట్టి కాల్పులు జరపబోయాడు. అయితే, వెంటనే స్పందించిన జెడ్-ప్లస్ భద్రతలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కమాండోలు దుండగుడిని పక్కకు నెట్టేశారు. దీంతో తూటా గురి తప్పి ఫరూక్ అబ్దుల్లా సురక్షితంగా బయటపడ్డారు. ఈ నాటకీయ పరిణామాలకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దాడి విఫలమైన వెంటనే అక్కడున్న వారు దుండగుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిని జమ్మూలోని పురానాస్ మండీకి చెందిన కమల్ సింగ్ జమ్వాల్ (65)గా గుర్తించారు. అరెస్ట్ తర్వాత కూడా అతడిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని, ఈ క్షణం కోసం గత 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని చెప్పినట్లు సమాచారం.
ఈ ఘటనపై ఫరూక్ కుమారుడు, సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ఇది కచ్చితంగా తన తండ్రిపై జరిగిన హత్యాయత్నమేనని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. “అల్లా దయవల్ల మా నాన్న త్రుటిలో తప్పించుకున్నారు. జెడ్-ప్లస్, ఎన్ఎస్జీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇంత సమీపంలోకి ఆయుధంతో దుండగుడు ఎలా రాగలిగాడనేది తీవ్రమైన ప్రశ్న. భద్రతా వైఫల్యంపై సమాధానాల కన్నా ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఘటన సమయంలో ఫరూక్ అబ్దుల్లా వెంట ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, సీఎం సలహాదారు నాసిర్ సోగామి కూడా ఉన్నారు. దేవుడి దయవల్ల అందరం సురక్షితంగా ఉన్నామని, దాడి వెనుక ఉద్దేశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని నాసిర్ సోగామి తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
నేనెవరికీ హాని చేయలేదు… నాపై దాడి ఎందుకో అర్థం కావడం లేదు: ఫరూక్ అబ్దుల్లా ఆశ్చర్యం

- తనపై జరిగిన హత్యాయత్నంపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా
- తాను ఎవరికీ అపకారం చేయలేదని, దాడికి కారణం తెలియదన్న ఫరూక్
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి పరామర్శించారని వెల్లడి
- కశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయనడం అబద్ధమని వ్యాఖ్య
- భద్రతా సిబ్బంది అప్రమత్తత వల్లే తాను బయటపడ్డానని స్పష్టం
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా తనపై జరిగిన హత్యాయత్నంపై తొలిసారిగా స్పందించారు. తాను జీవితంలో ఎవరికీ హాని చేయలేదని, తనపై ఎందుకు దాడికి ప్రయత్నించారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు బుధవారం సాయంత్రం ఫోన్ చేసి పరామర్శించారని ఆయన తెలిపారు.
జమ్మూలోని తన నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ, “నా తలుపులు ఎప్పుడూ అందరి కోసం తెరిచే ఉంటాయి. నన్ను కలవడానికి వచ్చే ప్రజల సమస్యలు విని, నాకు సాధ్యమైనంత సహాయం చేస్తాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరికీ అపకారం చేయలేదు” అని అన్నారు. పెళ్లి వేడుకలో జరిగిన ఘటనను వివరిస్తూ, “నా మెడ వెనుక ఏదో వేడిగా తగిలినట్టు అనిపించింది. మొదట టపాసుల శబ్దం అనుకున్నాను. కానీ, నా భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు. వారు అతని చేతిని పక్కకు తోయడంతో తూటా గాల్లోకి దూసుకెళ్లింది. వారి వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను” అని తెలిపారు. జమ్మూకశ్మీర్ పోలీసులు, ఎన్ఎస్జీ కమాండోలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ పదేపదే చెప్పడం మానుకోవాలని ఫరూక్ కోరారు. “దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతోంది. మేం స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర హోదాపై మాట్లాడుతూ.. పార్లమెంటు, సుప్రీంకోర్టులో హామీ ఇచ్చినా ఏళ్లు గడుస్తున్నా అమలు కాలేదని విమర్శించారు. వేర్పాటువాద నేత షబ్బీర్ షాకు బెయిల్ రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.