అమెరికాలో స్థిరపడినా పుట్టిన గడ్డపై మమకారం చాటుకున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ఎన్నారై దంపతులు. తమ స్వగ్రామమైన బోగోలు ప్రాంత అభివృద్ధికి విద్య, వైద్యం, ఆధ్యాత్మిక రంగాలలో ఏకంగా రూ.15 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి ఆదర్శంగా నిలిచారు. అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ దంపతులు చేస్తున్న సేవలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.
వివరాల్లోకి వెళితే… నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన బచ్చు కృష్ణకుమార్, సంధ్య దంపతులు అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. అయినప్పటికీ తమ మూలాలను మరవకుండా, వారు స్థాపించిన అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా బోగోలులో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి తమ వంతు సాయం అందించారు. పీ4 పథకంలో భాగంగా తహసీల్దారు కార్యాలయం పక్కన రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆసుపత్రి భవనానికి ఈ దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అర్ధాంగి జ్యోతి పాల్గొన్నారు. బచ్చు దంపతుల సేవలను ఎమ్మెల్యే కొనియాడారు.
ఆసుపత్రికే కాకుండా విద్యాభివృద్ధికి కూడా ఈ దంపతులు పెద్దపీట వేశారు. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో రూ.5 కోట్లు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల వారు మంత్రి నారా లోకేశ్ను కలిసి ఈ విషయాన్ని తెలిపారు. త్వరలో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించారు.
అలాగే, ఆధ్యాత్మిక సేవలో భాగంగా కొండబిట్రగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి మరో రూ.5 కోట్ల విరాళాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఇలా మొత్తం రూ.15 కోట్లతో తమ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు బచ్చు దంపతులు ముందుకు రావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “మన బడి-మన భవిష్యత్తు” వంటి కార్యక్రమాలకు ఇలాంటి ఎన్నారైల తోడ్పాటు మరింత బలాన్ని చేకూరుస్తోంది.